చిత్రమూలము

చిత్రమూలము గుబురుగా, అనేక శాఖలతో సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షికపు మొక్క. పత్రాలు అండాకారంలో కణుపుకు రెండు చొప్పున ఉంటాయి. వేరు ఉబ్బి దుంపలో ఉంటుంది. తెల్లటి పుష్పాలు శాఖల చివర ఏర్పడతాయి. ఫలాలు పొడవుగా ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా అక్టోబరు – డిసెంబరు మాసాలలో లభిస్తుంది. చిత్రమూలము మొక్కలో రెండు రకాలు ఉన్నాయి. అవి తెల్ల చిత్రమూలము మరియు ఎర్ర చిత్రమూలము. తెల్ల చిత్రమూలము బీడు భూములు, ఎర్ర భూములు, వర్షాధార భూములు, పంట పొలాల గట్ల వెంబడి పెరుగుతుంది. ఎర్ర చిత్రమూలము ఎక్కువగా అరణ్య ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనది.

ఈ మొక్కలో ”ప్లంబాజిన్‌” అనే శక్తి వంతమైన ”ఆల్కలాయిడ్‌” సైట్‌స్టెరాల్‌, ట్రైలినోలిన్‌ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.

ఈ మొక్కను వైద్యపరంగా జీర్ణశక్తిని పెంచే మందుల తయారీలోనూ, కడుపు నొప్పి, మధుమేహం, చర్మవ్యాధుల నివారణలోనూ వుపయోగిస్తారు.

చిత్రమూలము మొక్కలో వున్న రసాయనాలు కీటకాలకు ఆహార నిరోధకంగానూ (యాంటీ ఫీడెంట్‌), అభివృద్ధి నిరోధకంగానూ (రిపల్లెంట్‌) పనిచేస్తాయని డా|| శర్మ (1984) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

చిత్రమూలము కషాయానికి దోమల లార్వాలను నివారించే గుణం వుందని డా|| పాటిల్‌ (2011) పరిశోధనలు తెలుపుతున్నాయి.

చిత్రమూలము ఆకులను ‘పంచపత్ర కషాయం’లో రైతులు వినియోగించుకోవచ్చు. పంచపత్ర కషాయాన్ని మన రాష్ట్రంలో రైతులు సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణలో చాలా పంటలలో వుపయోగిస్తున్నారు.