ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244)
సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్లైన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ‘కిసాన్ మిత్ర’ ప్రారంభించడం జరిగింది. కారణాలు ఏవైనా అధికారులకు మరియు రైతులకు మధ్య దూరం పెరగడం వలన చాలా సమస్యలు గురించిన సమాచారం రైతుల వరకు చేరట్లేదు. మరియు రైతుల సమస్యలు అధికారుల దృష్టికి రావట్లేదు. కనుక కిసాన్ మిత్ర రైతుల నుండి అందుకున్న సమస్యలని వెంటనే సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించే వరకు రైతుకు తోడుగా వుంటుంది. కిసాన్ మిత్ర ద్వారా వికారాబాద్తో పాటు ఆదిలాబాద్ (ఫిబ్రవరి 7, 2018) మరియు మంచిర్యాల జిల్లాల (మార్చి 29, 2018) రైతులకి సేవలు అందుతున్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ పంట కాలం నడుస్తున్నందున కిసాన్ మిత్రకు ఎక్కువగా రెవెన్యూ, రైతుబంధు పెట్టుబడి సహాయం, పంట బీమా, పంట రుణాలు, రుణమాఫీ, సేంద్రీయ వ్యవసాయం గురించిన సమాచారం గురించిన ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఒక దానితో ఒకటి ముడిపడినందున రైతుల తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. పట్టా పాసుబుక్కు రాకపోతే రైతుబంధు పెట్టుబడి సహాయం అందదు, అంతే కాక పంట ఋణం తీసుకునే సౌలభ్యం వుండదు అలాగే పంట బీమా చేసుకోలేరు. అన్నీ ఉండి పంటఋణం రెన్యువల్ చేయించుకోవాలంటే ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించింది కాబట్టి రెన్యువల్ చేసుకోవచ్చో లేదో అనే సందేహం. అదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డులు గత సంవత్సరం జారీ చేసారు, ఈ సంవత్సరం తిరిగి వాటిని రెన్యువల్ చేసుకోవాలి. కానీ సర్క్యులర్ రాలేదనే కారణంతో తహసిల్దార్లు ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ చెయ్యలేదు మరియు ఉన్న వాటిని రెన్యువల్ చెయ్యట్లేదు, పత్తికి పంట బీమా చెల్లించే గడువు జూలై 15వ తేదీన ముగుస్తున్నందున కౌలు రైతులు మరియు పట్టా పాసుబుక్కు రాని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కిసాన్ మిత్ర ఆయా జిల్లాల యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం వైపు కిసాన్ మిత్ర అడుగులు
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రారంభించడానికి ముఖ్య కారణం తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు అనేక మంది విశ్లేషించారు. అందులో ఒక ముఖ్యమైన కారణం పంట మీద చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడడం. రైతు తన పంట పెట్టుబడి కోసం అవసరమైన రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులకు అప్పు చేయాల్సి వస్తోంది ఆ తర్వాత కరువు, వర్షపాతం లోటు భారీ వర్షాలు లేదా చీడ పీడల వలన అనుకున్న దిగుబడి రాక ఆ తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక పోతున్నారు. వీటి నుండి బయట పడడానికి రైతులకి ఉన్న ఒక మార్గం, రసాయనిక వ్యవసాయాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం. సేంద్రియ వ్యవసాయ పద్దతిలో రైతు తనకు స్థానికంగా దొరికే వనరులను వుపయోగించడం వలన తన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు అలాగే కొనుగోలుదారులు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ సేంద్రీయ ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపించడం వలన మార్కెట్లో వీటికి మంచి ధర కూడా లభిస్తోంది.
ఈ ప్రక్రియలోనే కిసాన్ మిత్ర పనిచేస్తున్న జిల్లాలో ఒకటి అయిన మంచిర్యాల జిల్లా పాలనాధికారి శ్రీమతి భారతి హోళికేరి గారు సేంద్రీయ వ్యయసాయం మీద చాలా మక్కువ చూపిస్తూ జిల్లాలో జరిగే ప్రతి మీటింగ్లో రైతులకు సేంద్రీయ వ్యవసాయం వైపుగా ప్రోత్సాహించడం గమనించి కిసాన్ మిత్ర, సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ) కలిసి రైతులకు మరియు అధికారులకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ ఇస్తాం అని ఒక ప్రతిపాదన కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. అందుకు వెంటనే అంగీకరించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయధికారితో కలిసి శిక్షణా తరగతులకు తేదీలు నిర్ణయించి, జిల్లాలో 750 మంది రైతులతో 1500 ఎకరాలలో ఈ సంవత్సరం సేంద్రీయ వ్యవసాయం చేయించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మొదట జిల్లాలోని లక్సెట్టిపేట్, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మండలాల్లో మే 17,18,19వ తేదీలలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. దీని కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం నుండి రాజశేఖర్, కన్నెగంటి రవి మరియు యాదవరెడ్డి హాజరయ్యి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత మే 25వ తేదీన మంచిర్యాలలో డా|| జి.వి. రామాంజనేయులు వ్యవసాయ, ఉద్యాన మరియు గ్రామీణాభివృద్ది శాఖ సిబ్బందికి సేంద్రియ వ్యవసాయం గురించి, తిరిగి వారి మండలాల్లోని రైతులకు శిక్షణ ఇచ్చే లాగా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలన్నింటిలో ముఖ్యంగా రసాయన వ్యవసాయం వలన కలిగే దుష్పరిణామాలు మరియు సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే ఉపయోగాలతో పాటు, అందరినీ పి.జి.ఎస్. సర్టిఫికేషన్ క్రిందకు తీసుకు రావాలని,రైతులను సహకార సంఘాలుగా నిర్మాణం చేయాలని, రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని చర్చించడం జరిగింది. శిక్షణతో పాటుగా మనకు స్థానికంగా దొరికే వనరులతో సేంద్రీయ ఎరువులు, ద్రావణాలు మరియు కషాయాలు ఎలా చేసుకోవాలి అనే సమాచారాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం తనకున్న అనుభవంతో వ్రాసిన ”స్థానిక వనరులతో సుస్థిర సేద్యం” అనే ఒక పుస్తకాన్ని జిల్లా యంత్రాంగానికి మరియు రైతులకు అందించడం జరిగింది.
ఈ క్రమంలో కిసాన్ మిత్ర రైతులకు విత్తనం దగ్గర నుండి మార్కెట్ వరకు అవసరమయ్యే సూచనలు మరియు సలహాలు ఇవ్వడానికి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అందులో వారికి కావాల్సిన సమాచారం అందిస్తున్నాము. అలానే వివిధ పంటలకు సేంద్రీయ వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులను వివరంగా జిల్లా వ్యవసాయ శాఖకు సమాచారం పంపడం జరిగింది. దానితో పాటు రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి తమకు అవసరమైన ఎరువులు, కషాయాలు, ద్రావణాలు ఉమ్మడిగా తయారు చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతోంది.
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…?
సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ కేవలం రాష్ట్ర, జిల్లా స్థాయి స్థూల అభివృద్ధి (జీడీపీ) పెరగడమే, రాష్ట్ర అభివృద్ధిగా పరిగణిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో సంపద పెరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగొచ్చు. కొంతమంది ఆదాయం వందలరెట్లు పెరగొచ్చు. ప్రస్తుతమున్న నిర్దిష్ట నిర్వచనం ప్రకారం తలసరి ఆదాయాలు కూడా పెరిగినట్లు కనిపించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితిలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ముఖ్యంగా మొత్తం సమాజంలో 70 శాతంగా ఉన్న గ్రామీణ ప్రజల, ఆదివాసీ ప్రజల, అసంఘటితరంగ శ్రామికుల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? అనేది మొత్తం ”అభివృద్ధి” చర్చకు ప్రాతిపదిక కావాలి. అలాగే సహజ వనరుల (భూమి, నీటి వనరులు, అడవులు, ఖనిజ సంపద) సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణ (విష పూరితం కాని గాలి, నీరు, సాగు భూమి), మానవ వనరుల వినియోగం
(ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం) కూడా ఈ చర్చకు ప్రధాన భూమిక కావాలి.
కుటుంబాల, లేదా వ్యక్తుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, ఆయా కుటుంబాల లేదా వ్యక్తుల ఆర్ధిక ఆదాయాల పెరుగుదల ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది. ఈ ఆదాయాల పెరుగుదల – సహజ వనరులపై, జీవనోపాధిలపై ఆయా సమాజ సమూహాలకు, వ్యక్తులకు ఏ మేరకు హక్కు ఉంది, వనరుల వినియోగానికి ఏ మేరకు అవకాశం ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది సహజ వనరులపై, అవకాశాల వినియోగంపై హక్కు కోసం ప్రజా సమూహాలు, వర్గాలు నిరంతర పోరాటాలు సాగిస్తుంటాయి. ఈ పోరాటాలు కొన్ని సందర్భాలలో సాయుధ పోరాటాల రూపం తీసుకున్నా, కొన్ని సార్లు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజా ఉద్యమాల రూపం తీసుకున్నా అంతిమ సారాంశంలో అవి వనరులపై హక్కు కోసం సాగిన పోరాటాలే. అలా తెలంగాణ రాష్ట్రం పరిధిలో 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం ‘దున్నేవానికి భూమి హక్కు కావాలి’ అనే నినాదంతో సాగింది. గత 50 సంవత్సరాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ”నీళ్లు, నిధులు, నియామకాలు ”నినాదంతోనే సాగింది. ఈ ఉద్యమాలు తెలంగాణ ప్రజలకు, మొత్తం భారత దేశానికి కూడా విలువైన విజయాలను, ఫలితాలను అందించాయి. దేశ వ్యాపితంగా పేద ప్రజలు సాగించిన ఇటువంటి ఉద్యమాల ఫలితంగానే అనేక చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు) వచ్చాయి. ఈ చట్టాలకు, జీవోలకు అనుగుణంగా అనేక మార్గదర్శకాలు కూడా అమలులోకి వచ్చాయి. కానీ, అసలు సమస్య-ప్రభుత్వాలు ఆయా చట్టాలను, జీవోలను వాటి స్పూర్తితో అమలు చేయకపోవడం.
తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు, జీవోలు ఇలాగే అమలుకు నోచుకోకుండా ఉండిపోతున్నాయి. అమలు అయిన చోట కూడా, అరకొరగా అమలవుతున్నాయి. ఈ చట్టాలను సంపూర్ణ స్పూర్తితో అమలు చేయకపోతే, సమాజంలో అట్టడుగున వున్న వర్గాలకు హక్కులు దక్కవు. ఆదాయాలు పెరగవు. రాష్ట్ర స్థూల ఆర్ధిక వృద్ధి జరిగినా, మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం పెరగవు. రాష్ట్రంలో 1956 తెలంగాణ కౌలు రైతుల చట్టం, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం, 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2011 అధీకృత సాగుదారుల (కౌలు రైతుల) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టం, 2016 వ్యవసాయదారుల రుణ విముక్తి చట్టాల అమలుతీరు దారుణంగా ఉంది. అలాగే భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందించేందుకు 2014 జులై 26న వచ్చిన జీవో. నంబర్ 1, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన జీవో 194 కూడా అమలు కావడం లేదు. లక్షలాది మంది అసంఘటిత కార్మికులకు ప్రయోజనకరమైన అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పని తీరు కూడా నాసి రకంగా ఉంది.
ఈ చట్టాలను, జీవోలను అమలు చేయడానికి పూనుకోని ప్రభుత్వం, తన కవసరం అయినప్పుడు మాత్రం కొత్త చట్టాలను, జీవోలను వేగంగా తెచ్చి అమలు చేయడానికి పూనుకుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల పేరిట భూములను సేకరించడానికి, 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ 2016లో తెచ్చిన ప్రత్యేక భూసేకరణ చట్టం, జీవో 123, మరియు 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయితీలకు ఇచ్చిన హక్కులకు తూట్లు పొడుస్తూ, ఎటువంటి చట్టబద్ధతా లేని రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ 2017 సెప్టెంబర్ 9న తెచ్చిన జీవో నంబర్ 39 ఈ కోవకు చెందుతాయి.
1973లో వచ్చిన భూ గరిష్ట పరిమిత చట్టం నిజంగా అమలు జరిగి ఉంటే ఈ రాష్ట్రంలో భూసంస్కరణలు దేశానికి ఆదర్శంగా ఉండేవి. కానీ ఈ చట్టానికి మొదటి దశలోనే వివిధ మినహాయింపులతో తూట్లు పొడిచారు. దానితో మిగులు భూమి ఎక్కువ తేలలేదు. తేలిన మిగులు భూమి కూడా కోర్ట్ వివాదాలలో చిక్కుకుంది. పేదలకు పంచిన కొద్ది పాటి భూమి కూడా, సాగు యోగ్యం కాకుండా వుండింది. 1980 దశకం తర్వాత భూ సంస్కరణలు బూతు మాటగా మారాయి. భూ పోరాటాలు కూడా తగ్గు ముఖం పట్టాయి. ఇవాళ వందలాది ఎకరాలు కలిగిన పెద్ద జమీందారులు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు. భూ గరిష్ట పరిమితి చట్టం అమలు గురించి అడిగే నాథుడే లేడు .మాగాణి భూమి 18 ఎకరాల కంటే ఎక్కువ, మెట్టభూమి 54 ఎకరాల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి (5 గురు సభ్యుల) ఉండకూడదని చట్టం చెబుతున్నా, అది అమలవుతుందా లేదా అని పట్టించుకునే వాళ్ళు లేరు. పేదలకు భూమి పంచండి అని రైతు సంఘాలు అడిగినా ”భూమి ఎక్కడ ఉంది” అనే ప్రశ్న ప్రభుత్వాల నుండి వినపడుతుంది. సమగ్ర భూసర్వే చేసి, భూ సంస్కరణల చట్టం (గరిష్ట పరిమితి) ప్రకారం మిగులు భూమి తేల్చితే, పేద గ్రామీణులకు పంచడానికి భూమి బయటకు వస్తుంది.
తెలంగాణ గ్రామీణ సమాజంలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభాకు సెంటు భూమి దక్కలేదని 2011 సామజిక, ఆర్ధిక కుల గణన (ఎస్.ఇ.సి.సి.) సర్వే తేల్చి చెప్పింది. గత 15 సంవత్సరాలలో అరకొరగా పేదలకు భూ పంపిణీ జరిగినప్పటికీ 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల దళిత కుటుంబాలకు భూమిలేదని, ఈ కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున 9 లక్షల ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 2014 ఆగష్టు 15 నుండీ, ఇప్పటి వరకూ కేవలం 5,185 మందికి 13,190. 23 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చింది. గత సంవత్సర కాలంగా పూర్తిగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ విషయాన్ని పూర్తిగా మాట్లాడటం మానేసింది. భూ పంపిణీ జరగని కారణంగానే రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్రంలో 13 శాతం మంది కౌలు రైతు ఉన్నారని నీతీ ఆయోగ్ ప్రకటించినా, 10 లక్షలకు మించి కౌలు రైతులు ఉంటారని అనేక ప్రభుత్వ నివేదికలు నిర్ధారించినా, కౌలు రైతులను గుర్తించే 2011 అధీకృత సాగుదారుల చట్టం అమలు కావడం లేదు. కౌలు రైతులకు, బ్యాంకు రుణాలు, రైతుబంధు లాంటి పథకాలు అమలు కావడం లేదు. సెంటు భూమి లేని కౌలు రైతులు రైతు బీమాకు కూడా అర్హత సాధించలేకపోతున్నారు. చట్టం వచ్చిన తోలి దశలో 44,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా ,తెరాస ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమలుచేయడం లేదు. కౌలు రైతులు తమ ప్రాధాన్యతే కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. కౌలు రైతులకు కూడా తాకట్టు లేని పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు ఎన్ని సర్క్యూలర్లు జరీచేసినా బ్యాంకులు అమలు చేయవు. దీనితో కౌలు రైతు కుటుంబాల ఆదాయాలు పెరగడం లేదు. కౌలు ధరలపై నియంత్రణ లేకపోవడం వల్ల, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
గ్రామీణ కుటుంబాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మరో చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో పని కోరుకున్న ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించాలి. కరువు కారణంగా వలసలను నివారించి, గ్రామంలోనే ఆదాయాలు కల్పిచే లక్ష్యం ఈ చట్టానికి ఉంది.
కానీ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండీ ఈ చట్టం అమలుతీరు ఘోరంగా ఉంది. 2019 మార్చ్ నాటికి ఈ రాష్ట్రంలో 53 లక్షల 95 వేల కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయగా, ఇందులో 32 లక్షల 18 వేల జాబ్ కార్డులు మాత్రమే ఆక్టివ్గా ఉన్నాయి. ఈ జాబ్ కార్డుల ఆధారంగా మొత్తం 1 కోటీ 16 లక్షల 46 వేల మంది పని కోసం నమోదు చేసుకోగా, 2019 మార్చ్ నాటికి ఆక్టివ్గా వున్న శ్రామికులు 58 లక్షల 98 వేల మంది మాత్రమే. జాబ్ కార్డులు పొందిన కుటుంబాలలో 2018-2019 సంవత్సరంలో కేవలం 24 లక్షల 22 వేల కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఈ కుటుంబాల నుండి పనిలో పాల్గ్గొన్న శ్రామికులు 40 లక్షల 68 వేల మంది మాత్రమే. చాలా సందర్భాలలో శ్రామికులు పని కోరుకున్నా, పనులు కల్పించడం లేదు. అనేక సార్లు ఈ పధకం క్రింద పనికి వెళితే నెలలు గడిచినా వేతనాలు రాకపోవడం వల్ల శ్రామికులు కూడా ఆసక్తి చూపించడం లేదు. విచిత్రమేమిటంటే మొత్తం జాబ్ కార్డులు పొందిన యాక్టీవ్ కుటుంబాలలో 100 రోజులు పూర్తిగా పని దొరికిన కుటుంబాలు కేవలం 1 లక్షా 53 వేల 823 మాత్రమే. 205 రూపాయలు ఉపాధిహామీ రోజు వేతనంగా నిర్ణయించినా, 2018-2019లో పడిన సగటు రోజు కూలీ 146.61 రూపాయలు మాత్రమే. చట్టం ప్రకారం నిజంగా జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికీ 100 రోజుల పని కల్పించగలిగితే, ఆయా కుటుంబాలకు కనీసం 15,000 రూపాయలు సంపాదించుకోగలిగేవి. కానీ ఒక కుటుంబానికి సగటున 43 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. వర్షాధార ప్రాంతాలలో ఈ చట్టం క్రింద దొరుకుతున్న పని, వస్తున్న ఆదాయం కూడా గ్రామీణ పేద కుటుంబాలకు అత్యంత ముఖ్యమైనవి.
ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా సరిగా లేకపోవడం వల్ల ఆదివాసీ కుటుంబాల వ్యవసాయానికి సరైన మద్ధతు అందడంలేదు. పోడు వ్యవసాయదారులుగానే వాళ్ళను చూడడం వల్ల, పంట రుణాలు, రైతుబంధు, రైతు బీమా అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2018 నవంబర్ 30 నాటి నివేదిక ప్రకారం 1,86,679 దరఖాస్తులు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు పెట్టారు. అందులో 1,83,252 దరఖాస్తులు వ్యక్తిగత భూ హక్కుల కోసం, మరియు 3,427 దరఖాస్తులు అడవిపై సముదాయక హక్కుల కోసం పెట్టినవి. ఇందులో కేవలం 94,360 దరఖాస్తులను మాత్రమే (93,639 వ్యక్తిగత మరియు 721 సాముదాయక) ఆమోదించారు. మరో 83,757 దరఖాస్తులను తిరస్కరించారు (44 శాతం). చట్టం ప్రకారం హక్కులు కల్పించిన అటవీ భూమి కేవలం 7,54,339 ఎకరాలు మాత్రమే. ఎందుకు తమ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయో ఆదివాసీ కుటుంబాలకు తెలవదు. ఈ హక్కులు కల్పించక పోవడం వల్ల ప్రభుత్వం నుండి ఈ కుటుంబాలకు వ్యవసాయ పరంగా అందాల్సిన ఏ సహాయమూ అందడంలేదు.
2016లో వ్యవసాయదారుల రుణవిముక్తి చట్టం చేసినా, ఆ చట్టం ప్రకారం పని చేయడానికి కమీషన్కు ఇంతవరకూ సరైన వసతి, ఫర్నిచర్ కూడా కల్పించలేదు. ఈ కమీషన్ గురించి వ్యవసాయ దారులలో ప్రచారం కూడా కల్పించలేదు. ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోతున్నారు. బ్యాంకు రుణాలు కూడా తీర్చలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతులకు అందాల్సిన మద్ధతు ధరలు అందకపోవడం వల్ల రైతుల ఆదాయాలు పెరగడంలేదు.
వ్యవసాయ కుటుంబాల సంక్షోభం కారణంగా ఈ రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటి వరకూ 3,850 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారం రిపోర్ట్ అయినవి కేవలం 2066 మాత్రమే. ఇందులో కూడా ప్రభుత్వం ”న్యాయమైన ఆత్మహత్యలుగా ”గుర్తించినవి 1,149 మాత్రమే. వీటిలో 846 కుటుంబాలకు 194 జీవో ప్రకారం 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి ఆమోదం తెలిపారు. కానీ, విషాదమేమిటంటే ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించిన 500 బాధిత కుటుంబాలాకు నిధులు విడుదల చేయలేదు. లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని చెప్పే ప్రభుత్వానికి ఈ 500 కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి 30 కోట్ల రూపాయలు లేవా…?
అమలు కాని జీవోలు, చట్టాల వల్ల గ్రామీణ వ్యవసాయ దారులు, ఎంతగా నష్టపోతున్నారో, ఎంతగా మానసిక క్షోభకు గురవుతున్నారో ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా అర్థమవుతుందా…?
అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి
రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు,
అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి.
శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి.
నిరంతరం భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి.
ప్రజానుకూల ”రెవెన్యూ కోడ్” కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడిగా డిమాండ్ చేద్దాం
రైతులకు, రెవెన్యూ సిబ్బందికి రైతు స్వరాజ్య వేదిక – తెలంగాణ రైతు జే.ఏ.సి పిలుపు
గ్రామీణ ప్రజలారా, రెవెన్యూ శాఖ ఉద్యోగులారా…
తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు, రెవెన్యూ శాఖ ఉద్యోగులకు మధ్య ఒక అనారోగ్యకర వాతావరణం నెలకొని ఉంది. ఈ వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్య విధానాలు, ప్రకటనలు ప్రధాన కారణంగా పని చేస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా గ్రామీణ రైతులు, మరీ ముఖ్యంగా పేద, సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు తమ భూమి రికార్డులను లేదా భూమి సంబంధిత ఇతర విషయాలను పరిష్కరించుకునే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నెలలు, సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురి కావడమే కాక, ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు రైతులలో, రెవెన్యూ ఉద్యోగుల పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
ప్రధాన దోషి రాష్ట్ర ప్రభుత్వమే
గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా అనేక చర్యలు చేపట్టాల్సి వుంటుంది. జనాభా ప్రాతి పదికన, తగినంత మంది సిబ్బందిని నియమించ వలసి వుంటుంది. ఈ సిబ్బందికి చట్టాలపై, పరిపాలనా పద్ధతులపై, ప్రజలతో మెలగవలసిన తీరుపై సమగ్రమైన శిక్షణ ఇవ్వవలసి
ఉంటుంది. క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో సిబ్బంది పని చేయడానికి అవసరమైన మౌళిక వసతులను (సరైన భవనం, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఇతర పనిముట్లు) ఏర్పాటు చేయవలసి వుంటుంది. అవినీతికి ఆస్కారం లేని విధంగా టెక్నాలజీని తగిన స్థాయిలో ఉపయోగించుకోవలసి వుంటుంది. ప్రభుత్వపరంగా, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేలా జీవోలను, సర్క్యులర్లను క్రింది స్థాయి సిబ్బందికి, ప్రజలకు అర్థమయ్యేలా తెలుగు భాషలో విడుదల చేయాల్సి వుంటుంది.
మరీ ముఖ్యంగా భూ సంబంధిత వివాదాలు, సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు, వాటి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలను రాష్ట్ర స్థాయిలోనే చేపట్టవలసి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని అందుకుని, పూర్తి స్థాయిలో, నిర్ధిష్ట కాల పరిమితిలో, సమగ్ర భూసర్వేను చేపట్టి పూర్తి చేయాల్సి వుంటుంది. భూ సరిహద్దులను, విస్తీర్ణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించి, భూ యజమాన్య హక్కులను ‘సెటిల్’ చేయవలసి వుంటుంది. భూ వివాదాలను పరిష్కరించేందుకు, అన్ని స్థాయిలలో భూ వివాద పరిష్కార ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేయవలసి వుంటుంది. రాజకీయాలకు, పక్షపాతానికి, అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనా పద్ధతులను అభివృద్ధి చేయవలసి వుంటుంది.
కానీ ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలలో చేయలేదు. సమగ్ర భూ సర్వే చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి, కొంత నిధుల సహాయం పొందినా, కేవలం భూ రికార్డుల ప్రక్షాళనకే పరిమితమైంది. అది కూడా తప్పుల తడకగా చేసింది. పార్ట్-బి పేరుతో వేలాది మంది రైతుల సమస్యలను పక్కకు నెట్టేశారు. సాదా బైనామా సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించలేదు. రైతులకు, ఇతర శాఖలకు అత్యంత ఉపయోగకరంగా ఉండాల్సిన ‘ధరణి’ వెబ్సైట్ ఇంకా చీకట్లోనే మగ్గుతోంది. భూ పరిపాలనా శాఖకు (సి.సి.ఎల్.ఎ) పూర్తిస్థాయి కమీషనర్ను నియమించకుండా, ఇంఛార్జీలపై నడిపిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నడిచిన ”భూ భారతి” ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. అత్యంత దుర్మార్గమైన మరో విషయం ఏమిటంటే, రెవెన్యూ శాఖలో జరుగుతున్న తప్పులన్నింటికీ రెవెన్యూ ఉద్యోగులే కారణమన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, రెవెన్యూ ఉద్యోగులందరూ అవినీతి పరులన్నట్లుగా చేసిన ప్రచారం, ప్రభుత్వాన్ని సమర్థించే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ధర్మగంట’ పేరుతో వచ్చిన కథనాలు, ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు పట్ల ఉన్న అసంతృప్తిని మరింత పెంచాయి.
రెవెన్యూ శాఖలో నెలకొన్న అవినీతి
గ్రామస్థాయి నుండీ ఆర్డీవో స్థాయి వరకూ రెవెన్యూ శాఖలో కొందరు ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. చేతులు తడపనిదే ఏ పనీ చేయడం లేదు. కావాలని రెవెన్యూ రికార్డులలో తప్పులు సృష్టించడం, వాటిని పరిష్కరించే పేరిట డబ్బులు గుంజడం మామూలై పోయింది. రెవెన్యూ కార్యాలయాలకు నెలల కొద్దీ తిప్పుకోవడం, జనన, మరణ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు కోరినా లంచం అడగడం, చివరికి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యుల నుండీ కూడా లంచం ఆశించడం కూడా గ్రామీణ ప్రజలలో ఈ శాఖ పట్ల ఒక వ్యతిరేక భావన ఏర్పడడానికి కారణమైంది. రెవెన్యూ శాఖలో కొంత మంది సిబ్బందే, ఇలా వ్యవహరించినా, వారి పట్ల మిగిలిన రెవెన్యూ సిబ్బంది, వారి యూనియన్లు, చివరికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉదాసీనంగా ఉండడం వల్ల, ఎప్పుడైనా కొందరు అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నా, యూనియన్లు అడ్డుపడి వారిని రక్షించడం వల్ల మొత్తం రెవెన్యూ శాఖే అవినీతిమయమనే భావన ప్రజలలో కలుగుతున్నది. ఈ ముద్రను పోగొట్టుకోవలసిన బాధ్యత మొత్తం రెవెన్యూ శాఖ సిబ్బందిపై వుంది. ఉద్యోగుల హక్కుల కోసం యూనియన్లు పోరాడడంతో పాటు ప్రజల పట్ల ఉద్యోగులు బాధ్యతగా ఉండి పనిచేయాలని తమ సభ్యులకు యూనియన్లు బోధించాలి.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు:
భూ రికార్డులలో తప్పుల వల్ల రైతులకు పంట రుణాలు, పంటల బీమా, రైతు బంధు, రైతు బీమా లాంటి మద్ధతు, ఇతర సబ్సిడీ పథకాలు అందడం లేదు. కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు అందడం లేదు. 1973 భూ గరిష్ట పరిమితి చట్టం అమలు కాక, భూమిలేని రైతులకు భూమి హక్కులు లభించడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాక, ఆదివాసీలకు, భూమి లేని పేదలకు హక్కులు లభించడం లేదు. రైతుల మధ్య సరిహద్దు తగదాల సమయంలో సర్వే త్వరగా పూర్తికాక, ఇరుపక్షాలూ నష్టపోతున్నాయి. మ్యూటేషన్ సకాలంలో పూర్తికాక, వారసులు, మహిళా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళా రైతుల భూ రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించడం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు కూడా ఆస్తి హక్కులు కల్పించడం లాంటి విషయాలలో రెవెన్యూ సిబ్బంది చొరవ చూపించడం లేదు.
ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు చైతన్యంతో ఐక్యంగా పోరాడాలి. రెవెన్యూ సిబ్బందిపై భౌతిక దాడులు, చంపడం లాంటి ఘటనలు రైతుల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడకపోగా, రైతులు ఆఫీసులకు వెళ్ళి రెవెన్యూ అధికారులను కలవడానికి కూడా, ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం వుంది. రియల్ ఎస్టేట్ మాఫియా, రెవెన్యూ అధికారులకు లంచమిచ్చి, భయపెట్టి పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. కానీ పేద ప్రజలు ఆ మార్గంలో పోకుండా, సంఘటిత శక్తితో, చైతన్యంతో సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.
రైతులకు, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి
- రెవెన్యూ చట్టాలపై, భూ సంబంధ విషయాలపై మరింత అవగాహన పెంచుకుందాం.
- సమస్యలను చైతన్యంతో, ఐక్యంగా ఉండి పరిష్కరించుకుందాం.
- లంచం అడిగే అధికారులపై అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేద్దాం. శిక్షపడేలా చూద్దాం.
- పొలం గట్ల మధ్య సరిహద్దు తగాదాలను ఊరి ప్రజల మధ్య సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం.
రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి విజ్ఞప్తి
- రైతుల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల గౌరవంతో, మానవత్వంతో వ్యవహరించండి.
- రైతులను, గ్రామీణ ప్రజలను లంచాల కోసం పీడించే మీ సహచరులను మీరే కట్టడి చేయండి.
- మీ పరిధిలో ఉన్న సమస్యలను, సకాలంలో, న్యాయంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.
- ప్రజానుకూలమైన ‘రెవెన్యూకోడ్’ కోసం రైతులతో కలసి ప్రభుత్వంపై పోరాడండి.
- రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్లు
- గ్రామీణ జనాభా ప్రాతిపదికన రెవెన్యూ శాఖలో అధికారులను, సిబ్బందిని, గ్రామ పంచాయితీ స్థాయిలో వి.ఆర్.ఓ.లను, సర్వేయర్లను నియమించాలి. మౌలిక సౌకర్యాలు కల్పించాలి. రెవెన్యూశాఖను ప్రైవేటీకరించే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. వివిధ శాఖల మధ్య పని విభజన చేసినా అది మరింత వివాదాలను లేవనెత్తకుండా చూడాలి.
- సమగ్రమైన, ప్రజానుకూలమైన ‘రెవెన్యూకోడ్’ను రూపొందించాలి.
- రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి చేసి, భూ సంబంధ అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి. రైతులకు, గ్రామీణ ప్రజలకు హక్కులు కల్పిస్తూ, ‘సిటిజన్స్ ఛార్టర్’ రూపొందించాలి. నిర్ధిష్ట కాలపరిమితిలో సమస్యలు పరిష్కరించేలా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేయాలి.
- రెవెన్యూ శాఖపై ప్రభుత్వం దుష్ప్రచారం ఆపి, ప్రజలకు, రెవెన్యూ సిబ్బందికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పడేలా కృషి చేయాలి. రెవెన్యూ సిబ్బందిని కలవడానికి, ప్రజలపై పెడుతున్న అన్ని రకాల ఆంక్షలను తొలగించాలి.
1 సెక్షన్ 6: విత్తన నాణ్యతలో… విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80 శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100 శాతం ఉండాలి.
2. సెక్షన్ 11: రాష్ట్ర విత్తన కమిటీలలో… రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు మహిళ) నియమించాలి.
3. సెక్షన్ 21: రైతుకు నష్టపరిహారంలో… రైతు నాసిరకం విత్తనం వలన నష్టపోయినచో కంపెనీ లేదా దుకాణదారుడు రైతుకు మొత్తం పంట నష్టం చెల్లించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత కంపెనీ నుండి రియంబర్స్ చేసుకోవాలి. పంట నష్టం అనగా మొత్తం పంట దిగుబడి నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కంపెనీ లైసన్స్ రద్దు చేయాలి. లైసన్స్ను అతని కుటుంబ సభ్యులకుగానీ, బంధువులకుగానీ ఇవ్వరాదు. పి.డి చట్టాన్ని అమలు చేయాలి. కంపెనీ లైసన్స్ హోల్డర్కు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించాలి.
4.సెక్షన్ 23: విత్తన అమ్మకం డీలర్లు రిజిస్ట్రేషన్ చేయుటలో… మైనర్లను డీలర్లుగా నియమించ రాదు. వ్యవసాయ శాఖ ప్రాధమిక డిగ్రీ ఉన్నవారికే డీలర్ లైసన్స్ ఇవ్వాలి. (ఉదా. మెడికల్ షాప్లకు బి ఫార్మసీ సర్టిఫికేట్ ఉండాలి.) కాలం గతించిన (ఆవుట్ డెటేడ్) విత్తనాలు అమ్మినచో ఒక సంవత్సరం జైలు శిక్ష, మరియు రూ.5 లక్షలు జరిమానా విధించాలి. డీలర్లు కంపెనీపై బాధ్యత నెట్టరాదు. స్వచ్ఛత గల విత్తనాలనే అమ్మాలి. కంపెనీతోపాటు డీలర్ కూడా రైతుకు బాధ్యత వహించాలి.
5. సెక్షన్ 24: పండ్ల మొక్కల నర్సరీ రిజిస్ట్రేషన్ చేయుటలో… ప్రతి పండ్ల మొక్కల నర్సరీ హెక్టార్కు లోపు ఉన్నప్పటికీ లైసన్స్ పొందాలి. నాణ్యతలేని మొక్కలు ఉత్పత్తి చేసినచో రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5 లక్షలు జరిమానా విధించాలి. రైతుకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం నర్సరీ లైసన్స్దారుడు చెల్లించాలి.
6. సెక్షన్ 40: దిగుమతి విత్తనాలలో… దిగుమతి విత్తనాలను 21 రోజులు క్వారంటైన్ పెట్టి, పరిశోధనలు చేసి మన వాతావరణానికి తగినవని ధృవీకరించబడిన తరువాతనే దిగుమతులను మార్కెట్కు విడుదల చేయాలి. ఒక వాతావరణం లోని విత్తనాలు మరో వాతావరణంలో మొలకెత్తవు.
7.సెక్షన్ 42: నేరాలు మరియు శిక్షలలో… విశ్లేషణ అధికారి లేదా నాణ్యత పరిరక్షించే అధికారిని నియమించిన పై అధికారికి ఏడాది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించాలి.
8. సెక్షన్ 44: విత్తన కంపెనీల నేరాలలో… నేరాలకు పాల్పడిన కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థల లైసన్స్లను రద్దుచేయాలి. కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల తీర్పులే అంతిమ నిర్ణయంగా ఉండాలి. వీటిపై ఎలాంటి అప్పీల్లు ఉండరాదు. కమిటీ నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సెక్షన్ 21లో చూపిన శిక్షను కంపెనీలపై అమలు జరపాలి.
– సారంపల్లి మల్లారెడ్డి
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2004కు 2010లో సవరణ తెచ్చింది. ఈ చట్టాలు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టలేదు.
ప్రస్థుతం కేంద్ర 2014 చట్టానికి సవరణలు తేస్తూ ”విత్తన చట్టం -2019 ముసాయిదాను” చర్చకు విడుదల చేసింది. 2014లోని చట్టాలు, 2019 సవరణలు ఈ దిగువ చర్చించబడినాయి.
అధ్యాయం -1
ప్రాధమికమైనవి
సెక్షన్ -1, చట్టం టైటిల్
2004 2019
55వ సంవత్సరం 70వ సంవత్సరం
చట్టం 2004 చట్టం 2019
సెక్షన్ -2, పదాల వివరణ
- ”వ్యవసాయం” – అనగా హార్టికల్చర్ అడవులు, మొక్కల సాగు పంటలు, ఔషధ, సుగంధపరమైన మొక్కలు
- ”రైతు” – అనగా స్వంత భూమి సాగు లేదా ఇతర విధాలుగా సాగు లేదా వ్యవసాయ పనుల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన పనులు చేయువారు.
- ”నేషనల్ సీడ్ వెరైటీస్” – ఒకటికి మించిన రాష్ట్రాలలో సాగుచేస్తున్న విత్తన రకాలు
- ”నోటిఫికేషన్” – అధికార గెజిట్లో ప్రకటించడం.
అధ్యాయం-2
కేంద్ర విత్తన కమిటీ మరియు సబ్ కమిటీల రిజిస్ట్రేషన్
3. కేంద్ర విత్తన కమిటీ రిజిస్ట్రేషన్ – సబ్ కమిటీల నియామకం
4. విత్తన కేంద్ర కమిటీ కూర్పు
- ఛైర్పర్సన్-సభ్యులు-ఎక్స్ అఫిషియో- ఇతర సభ్యులు – కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు.
- కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి – వ్యవసాయ – సహకార – రైతు సంక్షేమ శాఖ-వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన వారు ఛైర్పర్సన్గా ఉంటారు. (ఎక్స్ అఫిషియో)
ఎక్స్ అఫిషియో సభ్యులు
1. భారత వ్యవసాయ కమీషనర్
2. డిప్యూటి డైరెక్టర్ జనరల్ (క్రాఫ్ సైన్స్) ఐసిఎఆర్
3. డిప్యూటి డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్ సైన్స్), ఐసిఎఆర్
4. భారత విత్తన ఇంచార్జ్ జాయింట్ సెక్రటరీ
5. భారత హార్టికల్చర్ కమీషనర్
6. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్
7. భారత పర్యావరణ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ ¬దా కలిగిన వారు
8. జాతీయ ఔషధ మరియు సుగంధపరమైన మొక్కల పెంపకపు డైరెక్టర్
9. మొక్కల పరిరక్షణ రైతుల హక్కుల అథారిటీ ఛైౖర్మెన్
10. జాతీయు బయోడైవర్శిటీ అథారిటీ ఛైౖర్మెన్
వీరు కాక 8 మంది సభ్యులుంటారు.
5. కమిటీ విధులు
6. విత్తన నాణ్యత
విత్తన నాణ్యతకు గతంలో కమిటీ నోటిపై చేయాల్సి ఉండగా దానిని-2019లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని మార్చబడింది.
రైతు సంఘాల సూచన :
సెక్షన్ 6లో విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100శాతం ఉండాలి.
7. సబ్ కమిటీ – ఇతర కమిటీల రిజిస్ట్రేషన్ మరియు వాటి బాధ్యతలు
8. కమిటీ-సబ్ కమిటీల బాధ్యత
9. కార్యదర్శి మరియు ఇతర అఫీస్ బేరర్లు కమిటీ
10. కమిటీ సమావేశాలు
11. రాష్ట్ర విత్తన కమిటీలు
– రాష్ట్ర విత్తన రకాలను 2019 ప్రకారం రిజిస్ట్రి చేయాలి. హార్టికల్చర్కు బదులు పండ్ల తోటల నర్సరీలుగా మార్పు చేశారు.
మన సూచన :
సెక్షన్ 11లో రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు మహిళ) నియమించాలి.
అధ్యాయం – 3
విత్తన రకాలు, వెరైటీల రిజిస్ట్రేషన్
12. జాతీయ విత్తనాల రిజిస్ట్రేషన్ – విత్తన రకాలు మరియు ప్రత్యేకతలు
13. జాతీయ విత్తన రకాలు మరియు రాష్ట్రాల విత్తన రకాలు – రిజిస్ట్రేషన్
14. ఇతర ప్రత్యేక విత్తనాల రిజిస్ట్రేషన్
15. రిజిస్ట్రేషన్ విధానం
16. జన్యుమార్పిడి రకాల ప్రత్యేక ప్రోవిజన్ కొరకు రిజిస్ట్రేషన్
17. విత్తన రకాలు మరియు వెరైటీల రిజిస్ట్రేషన్ రద్దు పరుచుట
18. రిజిస్ట్రేషన్ రద్దు పరుచుటానికి నోటిపికేషన్ విడుదల చేయుట
19. విత్తన రిజిస్ట్రేషన్ నుండి కొన్ని రకాలను మినహాయించుట (పర్యావరణానికి నష్టం, వాణిజ్య దోపిడి రకాలను)
20. విత్తన ట్రయల్స్ను సమీక్షించడం
21. రైతుకు నష్టపరిహారం
– రైతు సంపెనీ నుండి కొనుగోలు చేసిన విత్తనం నాశిరకం అయి రైతు నష్టపోయినచో వినియోగదారుల చట్టం 1986 ప్రకారం (68/1986) పరిహారం చెల్లించాలి.
మన సూచన :
సెక్షన్ 21లో రైతు నాశిరకం విత్తనం వలన నష్టపోయినచో కంపెనీ లేదా దుకాణదారుడు రైతుకు మొత్తం పంట నష్టం చెల్లించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి ఆ తరువాత కంపెనీ నుండి రియంబర్స్ చేసుకోవాలి. పంట నష్టం అనగా మొత్తం పంట దిగుబడి నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. కంపెనీ లైసన్స్ రద్దు చేయాలి. లైసన్స్ను అతని కుటుంబ సభ్యులకుగాని, బందువులకుగాని ఇవ్వారాదు. పి.డి చట్టాన్ని అమలు చేయాలి. కంపెనీ లైసన్స్ హోల్డర్కు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమాన విధించాలి.
22. విత్తన ఉత్పత్తిదారులు, ప్రొసెసింగ్ యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేయుటు
23. విత్తన అమ్మకం డీలర్లు రిజిస్ట్రేషన్ చేయుట
మన సూచన :
సెక్షన్ 23లో మైనర్లను డీలర్లుగా నియమించరాదు. వ్యవసాయ శాఖ ప్రాధమిక డిగ్రీ ఉన్నవారికే డీలర్ లైసన్స్ ఇవ్వాలి. (ఉదా. మెడికల్ షాప్లకు బి పార్మసీ సర్టిపికేట్ ఉండాలి.) కాలం గతించిన (ఆవుట్ డెటేడ్) విత్తనాలు అమ్మినచో ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5లక్షలు జరిమాన విధించాలి. డీలర్లు కంపెనీపై భాద్యత నెట్టరాదు. స్వచ్చత గల విత్తనాలనే అమ్మాలి. కంపెనీతోపాటు డీలర్కూడా రైతుకు భాద్యత వహించాలి.
24. పండ్ల మొక్కల నర్సరి రిజిస్ట్రేషన్ చేయుట
మన సూచన :
సెక్షన్ 24లో ప్రతి పండ్ల మొక్కల నర్సరి హెక్టార్కు లోపు ఉన్నప్పటికీ లైసన్స్ పోందాలి. నాణ్యతలేని మొక్కలు ఉత్పత్తి చేసినచో రెండు సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5 లక్షలు జరిమాన విధించాలి. రైతుకు ఎకరాకు లక్ష రూపాయాలు పరిహారం నర్సరి లైసన్స్దారుడు చెల్లించాలి.
25. పండ్ల నర్సరి రిజిస్ట్రేన్దారుల భాద్యతలు
అధ్యాయం-4
విత్తన దృవీకరణ సంస్థలు మరియు విత్తన అమ్మకాల క్రమబద్దికరణ
26. రిజిస్ట్రీ అయిన విత్తన అమ్మాకాలను, రకాలను క్రమబద్దికరించుట
27. అత్యవసర పరిస్థితిలో అమ్మకం ధర క్రమబద్దికరించుట
28. రాష్ట్ర విత్తన దృవికరణ ఎజెన్సీ
29. విత్తన దృవీకరణ ఎజెన్సీ అక్రీడెషన్
30. రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ ద్వారా సర్టిపికేట్ ఆమోదించుట
31. సర్టిపికేట్ రద్దు పరుచుట
32. భారతదేశానికి బయట విత్తన దృవీకరణ సంస్థ ఆమోదం.
అధ్యాయం -5
అప్సీల్స్
33. అప్పీల్స్
అధ్యాయం-6
విత్తన విశ్లేషణ మరియు పరీక్షలు
34. కేంద్ర, రాష్ట్రాల విత్తన పరిశీలన లెబోరెటరీలు
35. విత్తన విశ్లేషకులు
36. విత్తన విశ్లేషకుల రిపోర్టు
37. కోర్టుకు విత్తన విశేషణలు ఇచ్చుట
38. విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్లు
39. విత్తన నాణ్యతను పరిశీలించే ఆధికారులు మరియు విత్తన ఇన్స్పెక్టర్ల అధికారాలు
అధ్యాయం-7
విత్తనాలు దిగుమతులు మరియు ఎగుమతులు
40. దిగుమతి విత్తనాలు
– 1986 చట్టం ప్రకారం నష్టం రాని విధంగా దిగుమతి చేసుకోవాలి.
మన సూచన :
సెక్షన్ 40లో దిగుమతి విత్తనాలను 21 రోజులు క్వారం టైన్ పెట్టి, పరిశోధనలు చేసి మన వాతావరణానికి తగినవని దృవీకరించబడిన తరువాతనే దిగమతులను మార్కెట్కు విడుదల చేయాలి. ఒక వాతావరణంలోని విత్తనాలు మరో వాతవరణంలో మొలకేత్తవు. (ఉదా. గతంలో దున్నలను దిగుమతి చేసుకోని బోన్ క్యాన్సర్ ఉండడం వల్ల డబ్బులు చేల్లించి చంపెశాం)
41. ఎగుమతి విత్తనాలు
అధ్యాయం-8
నేరాలు మరియు శిక్షలు
42. నేరాలు మరియు శిక్షలు (నాణ్యత సర్టిపై చేసే అధికారికి 2019 చట్టంలో)
1) రాష్ట్ర విత్తన కమిటీ, సబ్ కమిటీల ద్వారా విత్తన నాణ్యతను పరిరక్షించే అధికారిని నియమించాలి. ఆ అధికారి చట్ట ప్రకారం విధులు నిర్వహించనిచో రూ.25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పరిహరంతో శిక్షించాలి.
2) జీవవైవిద్య విత్తన రకాల విషయంలో ఈ శిక్షను రూ.25 వేల నుండి లక్ష రూపాయల వరకు విదించవచ్చు.
3) తప్పుడు సమాచారం జనటిక్ ప్య్రూరిటి, తప్పడు బ్రాండ్ మరియు నాణ్యత లేని జీవవైవిద్య విత్తనాలను, రిజిస్ట్రర్ కాని విత్తనాలను దృవీకరించినచో ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమాన లేదా రెండిటిని విదించవచ్చు.
మన సూచన :
సెక్షన్ 42లో విశ్లేషణ అధికారి లేదా నాణ్యత పరిరక్షించే అధికారిని నియమించిన పై అధికారికి ఏడాది జైలు శిక్ష, రూ.5లక్షల జరిమాన విధించాలి.
43. అస్తుల జప్తులు
44. విత్తన కంపెనీల నేరాలు
మన సూచన : సెక్షన్ 44లో నేరాలకు పాల్పడిన కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థల లైసన్స్లను రద్దుచేయాలి. కేంద్ర, రాష్ట్ర విత్తన కమిటీల తీర్పులే అంతిమ నిర్ణయంగా ఉండాలి. వీటిపై ఏలాంటి అప్పీల్లు ఉండరాదు. కమిటీ నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలి. సెక్షన్ 21లో చూపిన శిక్షను కంపినీలపై అమలు జరపాలి.
అధ్యాయం-9
కేంద్ర ప్రభుత్వ అధికారాలు
45. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం
46. కమిటీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చే అధికారం
అధ్యాయం-10
ఇతరములు
47. చట్టంలోని అంశాల మినహాయింపులు
48. మంచి ఉద్దేశంతో తక్షణ చర్యలు చేపట్టుట
49. అటంకాల తొలగింపుకు అధికారాలు
50. కేంద్ర ప్రభుత్వం రూల్స్ రూపొందించే ఆధికారం
51. కమిటీలు క్రమబద్దికరించే హక్కులు
52. పార్లమెంట్ ముందు రూల్ నోటిపికేషన్ పెట్టుట
53. కొట్టివేయడము మరియు కాపాడటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కేవలం రాజకీయ లబ్దికొరకు ప్రవేశపెట్టినదే తప్ప రైతు కష్టాన్ని, నష్టాన్ని గుర్తించి ఆదుకోవటానికి ఉద్దేశించినదిగా కనిపించదు. పి.ఎం. కిసాన్ సమ్మాన్ ద్వారా లభించు 6 వేల రూపాయలతో కలిపి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500/- రూపాయలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలు మార్గదర్శక సూత్రాలు లోప భూయిష్టంగా ఉన్నాయి.
కనీసం 1 ఎకరాకు మించిన భూమిని కౌలు చేస్తేనే కౌలు రైతుకు ఈ పథకం వర్తిస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీ.సి. మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే, ఒకే యజమానికి సంబంధించిన భూమిని ఒకరుకు మించి కౌలుదారులుంటే వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొనబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులకు ఆదాయాన్ని బట్టి పథకం వర్తిస్తుందని తెలిపింది. మంత్రులు, ఎమ్మేల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులకు, వ్యవస్థీకృత భూ యజమానులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేయబడింది.
వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి ఎన్నికల ముందు ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయం ఇన్ఫుట్ సబ్సిడీగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. (ఇటీవల దీనిని (3,500 రూ||లుగా పెంచారు.) కానీ ఎన్నికల అనంతరం బహుశా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 6 వేల రూపాయలను కూడా జోడించితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం తక్కువగా పడవచ్చనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. మార్గదర్శకాల రూపకల్పనలో ”పి.ఎం. కిసాన్ సమ్మాన్” పథక మార్గదర్శకాలను యదాతధంగా ”వై.ఎస్.ఆర్. భరోసా” పథకంలో కూడా చేర్చడం జరిగింది. ”పి.ఎం. కిసాన్ సమ్మాన్” మార్గదర్శకాలలో క్లాస్-4 / గ్రూప్ -డి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
”పి.ఎం. కిసాన్ సమ్మాన్” మరియు ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకాలు రెండింటిలోనూ శాస్త్రీయత, హేతుబద్ధత లోపించాయి. మనదేశంలో వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగుతూ వుంది. ఏటా గిట్టుబాటుకాక లక్షలాది మంది రైతులు సాగు నుండి వైదొలుగుతూ వున్నారు. ఏటేటా వేలాది మంది రైతులు, అందులో కౌలు రైతులు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పెరిగిపోతూ వున్న సాగు
ఉత్పత్తి వ్యయమునకు అనుగుణంగా కనీస మద్ధతు ధరలు లేకపోవటం, ఆ ధరలు కూడా దక్కక అనేక పంటల పైన రైతులు ఏటా సుమారు రూ. 30,000 కోట్లకు పైగా నష్టపడుతున్నారనే అంచనాలు ఒకవైపున ఉండగా, మనదేశంలో వరి, గోధుమ, పత్తి, చెఱకు పంటలకు భారత ప్రభుత్వం, డబ్ల్యు.టి.ఓ. నిబంధనలను అతిక్రమించి హెచ్చు స్థాయిలో మద్ధతు ధరలను ప్రకటించుతూ వుందని అమెరికా, బ్రెజిల్ మరికొన్ని దేశాలు డబ్ల్యు.టి.ఓ.లో ఫిర్యాదులు చేసిన నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పంటల ధరలతో సంబంధం లేకుండా రైతులకు నేరుగా పలు అభివృద్ధి చెందిన దేశాలు అందిస్తూ వున్న విధంగా ఆర్థిక సహకారమును అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నది. ఆశయం మంచిదే అయినా అమలు పరిచే విధానంలో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించాయి.
భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా కేవలం కుటుంబం ప్రాతిపదికగా తీసుకొనటం ఎంత మాత్రం సరికాదు. రైతుకు వున్న భూమి విస్తీర్ణత దామాషాలోనే నష్టం చేకూరుతూ వుంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో వుంచుకొని తెలంగాణా రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఎకరాకు ఒక పంటకు తొలుత రూ. 4,000/-లు, ఇప్పుడు రూ. 5,000/-లు చొప్పున రైతుకు అందచేస్తూ వుంది. ఇక్కడ కూడా ప్రధానమైన లోపం ఏమంటే భూమిని వాస్తవంగా సాగుచేస్తూ వున్న భూయజమాని లేక కౌలు రైతుకే ఆ ఆర్థిక సహకారం అందించటం కాకుండా కేవలం పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుండి, స్వయంగా వ్యవసాయం చేయక పోయినా, దూరంగా నగరాలలో వున్నా, చివరకున విదేశాలలో వున్న భూ యజమానులకు ”రైతు బంధు” ఆర్థిక సహకారం అందటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. మనదేశంలో ప్రస్తుతం 39.14 కోట్ల ఎకరాలలో రైతులు వివిధ పంటలను సాగుచేస్తూ వున్నారు. ఎకరాకు రూ. 4,000/-లు చొప్పున సహకారాన్ని అందించేందుకు 1,57,840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ప్రకటించుతూ వుంది. బడా పారిశ్రామిక వేత్తలు మరియు వ్యాపార వేత్తలకు చడీ, చప్పుడు లేకుండా లక్షలాది కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేస్తూ వుంటుంది. అటువంటిది మనదేశంలో స్థూల జాతీయ సంపద
ఉత్పత్తిలో 17 నుండి 18 శాతం సమకూరుస్తూ శ్రమజీవులలో సగం మందికి ఉపాధిని కల్పిస్తూ వున్న వ్యవసాయరంగం ఎదుర్కొంటూ వున్న సంక్షోభ నివారణకు, రేయనక – పగలనక, ఎండనక – వాననక, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొంటూ లాభదాయకం కాకపోయినా గత్యంతరం లేక మట్టిని పిసుకుతూ వున్న రైతులకు, కౌలు రైతులకు ఈ మేరకు ఆర్థిక సహకారం అందించవలసిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన వుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం పే కమీషన్ లెక్కల ప్రకారం మనదేశంలో ఒక కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000/-లు ఆదాయం వుండవలసి ఉంటుందని అంచనా వేసింది. ఆ సంస్థ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి. సంఘటిత శక్తితో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కానీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు కానీ తమ జీతభత్యాలను పెంచుకో గలుగుతున్నారు. మంత్రులు, ఎం.పి.లు, ఎమ్.ఎల్.ఎ.ల జీతభత్యాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ప్రభుత్వ సర్వే ప్రకారమే మనదేశంలో రైతు కుటుంబం సగటు నెలసరి ఆదాయం రూ. 6,460/-లు మాత్రమే ఇందులో కొంత వ్యవసాయం నుండి వస్తూ వుండగా మరొకొంత పశుపోషణ, లేక కూలీ, నాలీ పని చేస్తే లభిస్తుంది.
ఈ వాస్తవాలను పరిగణనలో వుంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తీర్ణం ప్రాతిపదికగా ప్రతి రైతు / కౌలు రైతుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయమును అందించేలా ఇప్పటికే ప్రకటించిన పథకాలలో మార్పు చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రవర్ణాలలో స్వంతంగా భూమిలేని వారు కొద్దిగా స్వంత భూమి వున్నా, కౌలు చేసుకుంటే మరికొంత ఆదాయం రావచ్చనే ఆశతో లక్షలాది మంది అగ్రవర్ణ కౌలుదారులు వున్నారు. వారిని కూడా తప్పనిసరిగా పథకంలో చేర్చవలసిన ఆవశ్యకత వుంది. కొన్ని సందర్భాలలో ఒకే రైతు భూమిని ఒకరికి మించి కూడా కౌలు రైతులు సాగుచేస్తూ వుంటారు. వారిలో ఒక్కరికే ఇస్తామనటం న్యాయం కాదు. కౌలు రైతుకు స్వంత భూమి కొంత వుంటే అనర్హత వేటు సరికాదు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీ.సి. వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వలన సంపూర్ణమైన ప్రయోజనం చేకూరదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేస్తూ వున్నా, రిజర్వు బ్యాంకు ఆదేశిక సూత్రాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అత్యధిక శాతం కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు లభించుట లేదు. పంటల బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీలు వారికి అందటం లేదన్నది నగ్నసత్యం. ఈ నేపధ్యంలో తెలంగాణాలో ”రైతు బంధు” పథకంలో వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
పైన వివరించిన అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన రైతు ఆదాయ పథకాలలో తగు మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. రైతు కుటుంబం ప్రాతిపదికగా కాక, ఎకరాకు పంటకు రూ. 4,000/-లు చొప్పున అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించి పథకాన్ని కొనసాగించినప్పుడే రైతు ఆదాయ మద్ధతు పథకం లక్ష్యం నెరవేరుతుంది. అలా చేసినపుడే వ్యవసాయం కొంత మేరకైనా గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
