ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త నిర్వహణలో అందిస్తున్న ”రైతు నేస్తం” పురస్కారాల్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా|| జి.వి. రామాంజనేయులు గారికి అందించడం జరిగింది. ముఖ్య అతిధి భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా డా|| జి.వి. రామాంజనేయులు గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర గవర్నర్ డా|| శ్రీమతి తమిళిసై సౌందర రాజన్ విశిష్ట అతిధిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్లోని స్వర్ణ భారతి ట్రస్ట్లో ఈ పురస్కార కార్యక్రమం జరిగింది.
మిత్రులారా..
దేశవ్యాపితంగా 2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్”కు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. ఆ రోజు గ్రామీణ ప్రాంత వాస్తవ సాగుదారులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, చేతి వృత్తుల వారు, ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ రైతులు సమ్మెలో పాల్గ్గొంటున్నారు.
ఆరోజు గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయ ూత్పత్తులు (పంటలు, పాలు, కూరగాయలు, పండ్లు), ఇతర ూత్పత్తులు బయట నగరాలకు వెళ్లకుండా ఆపడం, పట్టణ ప్రాంతాల నుండి వచ్చే ూత్పత్తులను, సేవలను గ్రామీణ ప్రాంతానికి రాకుండా అడ్డుకోవడం ఈ గ్రామీణ భారత్ బంద్ లక్ష్యం.
దేశ వ్యాప్తంగా గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు, చేతివృత్తుల వారు తీవ్ర సంక్షోభంలో ూన్నారు. గత 20 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 3,25,000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు వేల మంది వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ూన్నాయి. వ్యవసాయ కుటుంబాలకు ప్రభుత్వాల నుండి అందే సహాయం, బడ్జెట్ కేటాయింపులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. సబ్సిడీ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. బ్యాంకుల నుండి సంస్థాగత రుణాలు రైతులకు సకాలంలో అందడం లేదు. ఫలితంగా పంటల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలను నష్ట పోయినపుడు వారికి ఎటువంటి పరిహారం అందడం లేదు. చాలా సందర్భాలలో కల్తీ విత్తనాల వల్ల, కల్తీ ఎరువులు, పురుగు మందుల వల్ల రైతులు పంట దిగుబడులను నష్టపోతున్నారు. రైతులు పండించే పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నా వాటికి చట్టబద్దత లేకపోవడం వల్ల ప్రభుత్వ మార్కెట్ యార్డ్లలో కూడా అవి అమలు కావడం లేదు. ప్రైవేటు వ్యాపారులు దళారులు రైతుల నుండి అతి తక్కువ ధరలకే పంటలను కొంటున్నారు. ఫలితంగా పెడుతున్న ఖర్చులకు, వస్తున్న ఆదాయానికి పొంతన లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న పోడు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి భూములకు పట్టాలు దక్కడం లేదు. ఫలితంగా వారి వ్యవసాయానికి పంట రుణాలు, పంటల బీమా అందడంలేదు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులలో వారు వ్యవసాయం చేస్తున్నా వారి వ్యవసాయానికి ఎటువంటి ప్రత్యేక సహాయం లేదు. దేశవ్యాపితంగా, రెండు రాష్ట్రాలలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ూన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కానీ, వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు కానీ అమలు కావడం లేదు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఫలితంగా ఒంటరి మహిళా రైతులు, భూమిపై పట్టా హక్కులు లేని మహిళా రైతులు వ్యవసాయం చేస్తున్నా వారి వ్యవసాయానికి ఎటువంటి సహాయం దొరకడం లేదు.
ఈ స్థితిలోనే రైతులు 2020 జనవరి 8న భారత గ్రామీణ బందుకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో పనిచేస్తున్న 200 కు పైగా రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఇతర గ్రామీణ పేదల సంఘాలు ఈ సమ్మెకు ూమ్మడిగా పిలుపు ఇచ్చాయి. ఈ సమ్మెను బలపరచాలని సమాజంలోని మిగిలిన శ్రేణుల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ లేఖ రాస్తున్నాము. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ూపాధ్యాయ, ూద్యోగ సంఘాలు, సహకార సంఘాలు, రైతు ూత్పత్తిదారుల సంఘాలు జనవరి 8న జరగనున్న గ్రామీణ బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆరోజు మీ గ్రామంలో / మండలంలో / జిల్లాలో గ్రామీణ రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, ఆదివాసీలు, చేతివృత్తుల వారు నిర్వహించే బంద్కు పూర్తి స్థాయిలో సహకరించాలని, సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ రైతుల ప్రజల సమస్యలపై దృష్టి సారించేలా ఒత్తిడి తెచ్చేందుకు గ్రామీణ ప్రజలు సాగిస్తున్న ఈ బంద్ను విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక మాయ మాటలెన్ని చెప్పినా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం 2019 పేరుతో వెన్నుపోటు పొడిచింది. పైగా గత ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా 1956 ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టాన్ని, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని ఒక్క కలం పోటుతో ఈ చట్టం ద్వారా రద్దు చేయడానికి పూనుకుంది.
చట్టంలో కరణీకం భాష ఎంత వాడినా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఒక్కటే. కౌలు రైతులను గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదనీ, భూ యజమానులు, కౌలు రైతులు ఒక ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ రాసుకుని గ్రామ సెక్రెటేరియట్కు దాఖలు చేస్తే, ఆపుడు గ్రామ సెక్రెటేరియట్లో ఉన్న రెవెన్యు అధికారి దానిపై సంతకం చేసి కౌలు రైతుకు గుర్తింపు కార్డు జారీ చేస్తాడని, స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ఎంతో మెరుగుగా ఉంది. ఆ చట్టం స్ఫూర్తిని కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
1. 1956 చట్టం కౌలు రైతులకు 2 హక్కులు ప్రధానంగా కల్పించింది.
అ) ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాల వరకూ భూమి యజమానులు తమ భూమిని కౌలుకు ఇవ్వవచ్చు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం దీనిని 11 నెలలకు కుదించింది.
ఆ) పాత చట్టం కౌలు ధరలపై నియంత్రణ విధించి, పంట దిగుబడిలో 5వ వంతు మాత్రమే కౌలు ధర ఉండాలని చెప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కౌలు ధరపై ఎటువంటి నియంత్రణ పెట్టలేదు. అది భూ యజమానులు, కౌలు రైతుల మధ్య ఒప్పందానికి వదిలేసింది.
2. ఈ రెండు అంశాలూ వాస్తవానికి కౌలు రైతులకు అన్యాయం చేసేవే. కౌలు రైతుల మధ్య పోటీ పెరిగి కౌలు ధరలను పెంచుకుంటూ పోతున్న పరిస్థితి వుంది. దీనికి ప్రధాన కారణం భూమిని నమ్ముకుని వ్యవసాయం వృత్తిగా ఎంచుకుందామని భావిస్తున్న వాస్తవ సాగు దారుల చేతుల్లో భూమి లేకపోవడం వల్ల అనివార్యంగా వీరు కౌలుపై ఆధార పడుతున్నారు. పదులకొద్దీ ఎకరాలను కబ్జాలో పెట్టుకున్న భూముల యజమానులనేకమంది భూమిని కౌలుకు ఇస్తూ, కౌలు డబ్బుల రూపంలో లాభపడడమే కాకుండా, ఇంకా అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. వడ్డీ లేని పంట రుణాలు, బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ సబ్సిడీ పథకాలు, రైతు భరోసా లాంటి పథకాల ద్వారా లాభం పొందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాలను ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా, కొలు రైతులకు లాభం జరిగేలా నిబంధనలు పెట్టకుండా, కేవలం భూ యజమానులకు, కౌలు రైతుకు మధ్య ఒప్పందం పైనే కేంద్రీకరించి చట్టం తెచ్చింది.
3. భూ యజమానులకు నిజంగా తమ భూములను కౌలు రైతులు లాక్కుంటారని భయమేమీ లేదు. 1956 నుండీ ఒక్క కౌలు రైతు కూడా, తాము కౌలుకు చేస్తున్న భూమి తమదని కోర్టుకు వెళ్ళలేదు. హక్కులు సాధించలేదు. 2011 చట్టం వచ్చాక కూడా కౌలు రైతులు తాము సాగు చేస్తున్న భూములు తమవని ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు. భూమి యజమానులకు ఉన్న బాధల్లా, ఇంతకాలం తాము ఎంజాయ్ చేస్తున్న వడ్డీ లేని రుణాలు, గుర్తింపు కార్డుల ఆధారంగా కొలు రైతులకు ఇస్తే, తమకు దక్కకుండా పోతాయని మాత్రమే. అలాగే అప్పనంగా వచ్చిపడే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందవని మాత్రమే. ఈ కారణం చేతనే భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇచ్చి వేలాది రూపాయలు కౌలు రూపంలో పొందుతున్నా, దానిని పేపర్ పై ఒప్పందంగా వుంచడం లేదు. ఇప్పుడు ఈ చట్టం తెచ్చినా, ఏ భూ యజమాని, తాముగా వచ్చి, కౌలు రైతుతో వ్రాత పూర్వక ఒప్పందం చేసుకోడు. తాము అనుభవిస్తున్న సౌకర్యాలను వదులుకోరు. దీని వల్ల గత సంవత్సరాల కంటే ఈ సారి కౌలు రైతుల గుర్తింపు కార్డుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం వుంది. రైతు స్వరాజ్య వేదికగా మేము ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలను, అధికారులను కల్సి విజ్ఞప్తి చేసినా, అంతిమంగా అది ప్రభుత్వం అధినేత చెవికి ఎక్కలేదు. ఆయన 11 నెలల వ్రాతపూర్వక ఒప్పందం కోసం పట్టు పట్టి, కొలు రైతులకు అన్యాయమే చేశాడు. క్షేత్ర స్థాయి పరిస్థితులతో, ఆయనకు సంబంధం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని మేము భావించడం లేదు. భూస్వాముల భయాలను పోగొట్టే పేరున, కౌలు రైతులకు శాశ్వత అన్యాయం చేయడానికి పూనుకున్నాడు.
4. భూ యజమానులు, కౌలు రైతుల మధ్య వ్రాత పూర్వక ఒప్పందం చేయించడానికి ఏ బాధ్యతా తీసుకోని ప్రభుత్వం (2011 చట్టం – గ్రామ సభల ద్వారా కౌలు రైతుల ను గుర్తించే బాధ్యతను రెవెన్యూ శాఖకు పెట్టింది), బ్యాంకులకు మాత్రం ఉచిత సలహా ఇచ్చింది. ఈ కార్డు తప్ప, వేరే ఏ తాకట్టు పత్రాలూ అడగకుండా బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని. బ్యాంకులు దీనిని పాటించకపోతే ఏం చేస్తారో ఈ చట్టంలో మాట్లాడలేచు. ఒకవేళ భూమి యజమానులు వ్రాత పూర్వక ఒప్పందానికి ముందుకు రాకపోతే ప్రభుత్వం ఏమి చేస్తుందని కూడా చట్టంలో లేదు. భూ యజమానులు ఏ ప్రేమతో, ఏ భయంతో ఒప్పందానికి వస్తారు. ”సాగు భూములు, పంటలు వేయకుండా ఖాళీగా ఉంచితే సంపద పన్ను వేస్తామని చెప్పండి. భూ యజమాని, లేదా వారి తరపున అనుమతి పొందిన వారు వచ్చి ఒప్పందం చేసుకోకపోతే, గ్రామ సెక్రటేరియట్ బాధ్యత తీసుకుని తాను ఆ భూములను కౌలుకు ఇస్తుందని చెప్పండి ”అని మేము కోరాం. కానీ ఆ రకంగా భూ యజమానులను ఒప్పించే క్లాజులేవీ ఈ చట్టంలో లేవు. అంటే ఒకరకంగా ఈ చట్టం అమలు కాదన్న మాట. అమలు కాని చట్టం కోసం ఉన్న చట్టాలను కూడా రద్దు చేస్తున్నారు.
5. కేవలం 2 నెలల నోటీసుతో భూ యజమాని కౌలును రద్దు చేయవచ్చని చట్టంలో రాశారు. ఇది మరీ అన్యాయం. ఉన్నదే 11 నెలలు. కనీసం 3 సంవత్సరాలు కూడా కౌలు రైతుల చేతుల్లో భూమి వుంచకపోతే, ఏ కౌలు రైతు భూసార పెంపుదలకు పెట్టుబడులు పెట్టడు. భూసారాన్ని పెంచకపోతే, అధిక దిగుబడులకోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడితే ఆ భూములు త్వరగా వట్టిపోతాయి. ఈ నేపధ్యంలో రెండు నెలల నోటీసు అంటే కౌలు రైతుకు ఇక ఏ భరోసా ఉంటుంది. పైగా ఈ కారణము చూపి భూ యజమానులు, కౌలు రైతులను బెదిరిస్తూ, కౌలు ధరలు మరింత పెంచుకుంటూ పోయే ప్రమాదం వుంది.
6. ఇప్పటికే ఆంధ్రప్రదేశంలో కౌలు రైతులు సంక్షోభంలో వున్నారు. ప్రస్తుత చట్టం వల్ల వారు మరింత సంక్షోభంలో కూరుకుపోయే వుంది. కౌలు రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలి. ప్రస్తుత చట్టాన్ని వుపసంహరించు కోవాలి. 2011 చట్టాన్ని మరింత మెరుగుపరిచి, కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా, బ్యాంకులు రుణాలు ఇచ్చేలా భరోసా కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి.
7. వ్యవసాయ సంవత్సరం జూన్ నుండీ మే వరకూ అని చట్టంలో రాశారు కనుక, బ్యాంకులు ఏప్రిల్,మే నెలలలో భూ యజమానులకు ముందస్తు పంట రుణాలు యిచ్చే పద్ధతిని మానుకోవాలి. జూన్ 1 నాటికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ వివరాలను బ్యాంకులకు అందుబాటులో వుంచాలి. ఆ వివరాల ఆధారంగా మాత్రమే ఆయా సర్వే నంబర్లలో వాస్తవ సాగుదారులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి. ముందస్తుగా పంట రుణాలు భూ యజమానులకు ఇచ్చి, గుర్తింపు కార్డు పొందిన కౌలు రైతులకు మొండి చెయ్యి చూపే బ్యాంకులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టం కౌలు రైతులకు ఏ మాత్రమూ ఉపయోగపడేది కాదు. ఈ విషయంలో రైతు సంఘాలు కౌలు రైతుల పక్షాన గొంతెత్తాలి. వివిధ రాజకీయ పార్టీలు ఈ విషయంలో కౌలు రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు కూడా రైతులకు అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుండి వ్యాపారులు పంటలను సేకరణ చేస్తున్న సందర్భంలోనే కాకుండా, ప్రభుత్వ మార్కెట్యార్డులకు పంటను తెచ్చినప్పుడు కూడా సరైన నాణ్యత, తేమ శాతం వుండి కూడా వ్యాపారులు, రైతులకు కనీస మద్ధతుధర చెల్లించడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు నిజాయితీగా చేపడితే ఈ సమస్యను ఒక మేరకు పరిష్కరించవచ్చు.
- రాష్ట్రాలలో వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూముల స్వభావానికి అనుగుణంగా పంటలను పండించేలా విస్తరణ వ్యవస్థను బలోపేతం చేయాలి. దీనిపై నిరంతరం రైతులలో ప్రచారం చేయాలి. పంటల మార్పు సందర్భంలో ఎదురయ్యే సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలి. పంటల మార్పు కోసం అవసరమైన అన్ని రకాల మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
- వ్యవసాయరంగంలో పంటల ఉత్పత్తి ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో, ఆయా పంటల నమోదు, పంటల మార్కెటింగ్ (సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, బల్క్ మరియు రిటైల్ మార్కెటింగ్) రైతులకు కనీస మద్దతు ధరలు అందడం అంతే ప్రాధాన్యత కలిగిన అంశం .వీటిపై దృష్టి సారించాలి.
- రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలి. అందుకు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వుత్పత్తి ఖర్చులను తగ్గించలేని పరిస్థితులలో, ఆయా పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి, రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి లేదా కేంద్రం ప్రకటించిన పంటల మద్దతుధరల పథకం ద్వారా నేరుగా రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాలి.
- ప్రభుత్వ పంటల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మొత్తం వ్యవసాయ పంటల సేకరణలో ఉన్న ప్రైవేట్ వ్యాపారులను రిజిస్టర్ చేయాలి. వారి మార్కెటింగ్ లావాదేవీలను పర్యవేక్షించాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ (తెలంగాణా) రైతు సాధికార సంస్థ (ఆంధ్రప్రదేశ్) భాగస్వామ్యంతో వివిధ ప్రభుత్వరంగ, సహకార రంగ సంస్థలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాలను పంటల సేకరణలో భాగస్వాములను చేయాలి.
- మొత్తం పంటల సేకరణ వ్యవస్థ పారదర్శకంగా వుండేలా డిజిటల్ పద్దతిలోనే మొత్తం లావాదేవీలను నిర్వహించాలి.
- ఏ దశలో లోపాలు, తప్పులు, అవకతవకలు కనపడినా ఆయా స్థాయి ప్రభుత్వ అధికారులను నేరుగా బాధ్యులను చేయాలి. తప్పుల స్థాయిని బట్టి కఠిన శిక్షలు అమలు చేయాలి.
ఈ ప్రక్రియ నిర్వహించడానికి తొలి దశ నుండీ అన్ని విషయాలలోనూ సమగ్ర సమాచారం అవసరముంటుంది. ఈ సమాచారం కూడా సమయానుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో సేకరించవలసి వుంటుంది. ఆ సమాచారం అవసరమైన అన్ని ప్రభుత్వరంగ ఏజెన్సీలకు అందుబాటులో వుంచవలసి ఉంటుంది.
గ్రామస్థాయిలో సమాచార సేకరణకు గ్రామ పంచాయితీ కార్యదర్శి కన్వీనర్గా, గ్రామ రెవెన్యు అధికారి (వి.ఆర్.ఓ.), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వి.ఆర్.ఎ.), బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ (బి.ఓ.), వ్యవసాయ విస్తరణ అధికారి (ఎ.ఇ.ఓ.) – మెంబర్ సెక్రటరీగా ఒక కమిటీ పని చేయాలి.
ఈ కమిటీ గ్రామ పంచాయితీ పరిధిలో భూమి సర్వే నంబర్ల వారీగా పంట సాగు వివరాలను ప్రతి సీజన్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ వివరాల నమోదుకు తగిన ఎక్విప్మెంట్ ఈ టీంకు అందచేయాలి.
ఈ టీం సేకరించిన వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఒక సారి ఎంటర్ చేసిన వివరాలను మార్చేందుకు వీలు లేకుండా కట్టడి చేయాలి.
సర్వే నంబర్ల వారీగా కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులను గుర్తించే బాధ్యత కూడా ఈ గ్రామ స్థాయి కమిటీదే. ఈ సందర్భంగా రాజకీయ నాయకుల, భూయజమానుల ఒత్తిడికి లొంగి వాస్తవ సాగుదారుల వివరాలను తప్పుగా నమోదు చేస్తే, కమిటీ సభ్యులపై చర్యలు చేపట్టాలి.
మండల స్థాయిలో ఏర్పడే కమిటీకి మండల రెవెన్యూ అధికారి కన్వీనర్గా, డిప్యూటీ తహసీల్ధార్, ఎంపీడీఓ, స్థానిక ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ సభ్యులుగా, వ్యవసాయ అధికారి (ఎ.ఓ) మెంబర్ సెక్రటరీగా వ్యవహరించాలి. గ్రామస్థాయి కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి ఈ మండల స్థాయి కమిటీ వాస్తవ సాగుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
ఈ కమిటీలు అందించే సర్వే నంబర్ల వారీ వాస్తవ సాగుదారుల నివేదిక ప్రభుత్వం అందించే ప్రతి వ్యవసాయ మద్ధతు వ్యవస్థకూ ప్రాతిపదికగా ఉండాలి. (రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల సబ్సిడీ పథకాలకు) బ్యాంకులు ఇచ్చే పంట రుణాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాస్తవ సాగుదారులకు పంట రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం రుణ మాఫీ లాంటి పథకాన్ని కూడా ఈ నివేదికల ఆధారంగా వాస్తవ సాగుదారులకే అమలు చేయాలి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వ్యవసాయ అభివృద్ధి పథకాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి.
ప్రస్తుతం వేస్తున్న పంటలకు, తీసుకుంటున్నపంట రుణాలకు, బీమా చేస్తున్న పంటలకు ఏమీ పొంతన వుండడం లేదు. దాని వల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో దీనిని సరిదిద్దడానికి పంటల బీమా పథకాలకు కూడా అధికారుల కమిటీలు ఇచ్చే ఈ వాస్తవ సాగుదారుల నివేదికలు ప్రామాణికం కావాలి.
ఒక ప్రత్యేక సీజన్కు సంబంధించి వాస్తవ సాగుదారుల వివరాలు, పంటల సాగు వివరాలు సమగ్రంగా ఉంటే, పంటల దిగుబడుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. పంటల వారీగా సాగు విస్తీర్ణం, సగటు దిగుబడుల ఆధారంగా మొత్తం పంటల ఉత్పత్తి పరిమాణం తేలుతుంది. కుటుంబ అవసరాలు పోను, ఆయా పంటల వారీగా మార్కెట్ అమ్మకానికి ఎంత పంట వస్తుంది అనేది కూడా తేలుతుంది.
- జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే.
- జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం.
- నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ ఎరువును అందించడం ద్వారా నాణ్యమైన జీడిమామిడిని ఉత్పత్తి చెయ్యవచ్చు.
- వానాకాలంలో రెండు సార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచవచ్చు.
- నేల గుల్లగా అగుట వలన వర్షాకాలంలో వాననీరు ఇంకుటకు వీలవుతుంది.
- మొదటి 5 సంవత్సరాల వరకు కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, ఫాల్సా, బొప్పాయిలాంటి పండ్లతోటలను అంతర పంటగా వేయవచ్చు.
- అంతర పంటలు సాగు చేయటం వలన నేల సత్తువ బాగా అభివృద్ధి చెందుతుంది. కలుపు నివారణ కూడా అవుతుంది. రైతుకు ఆదాయం కూడా వస్తుంది.
- తేలిక పాటి భూములలో తగినంత చెఱువు మట్టిని 10-15 ట్రాక్టర్ లోడులు (సుమారు 50 టన్నులు) కనీసం 2 సంవత్సరముల కొకసారి వేయాలి.
- సేంద్రియ ఎరువులను (కంపోస్టు, నాడెప్ కంపోస్టు, వర్మీకంపోస్టు మొ||) చెట్టుకు వయస్సును బట్టి 5-10 కిలోలు వేయాలి.
- సేంద్రియ ఎరువును సంవత్సరానికి 2 సార్లు – జూన్ – జులై మరియు సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో వేసుకోవాలి.
- కోతకు వచ్చిన తోటలలో వర్షాకాలంలో నేలలో తేమ చూసి జూలై – ఆగస్టు నెలలలో కంపోస్టు వేసుకోవాలి.
- లేత తోటలలో చెట్ల మధ్య గల ఖాళీ స్థలంలో జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను వర్షాలు పడిన వెంటనే ఎకరాకు 10-15 కిలోల వంతున విత్తుకొని, పూత దశ రాగానే భూమిలో కలియదున్నాలి.
- కలియ దున్నడం వల్ల భూమికి సేంద్రియ పదార్థం, సూక్ష్మ పోషకాలు అందుతాయి. వానపాములు, సూక్ష్మజీవులు భూమిలో బాగా పెంపొందుతాయి.
- పొలంలోని ఎండు ఆకులను, వరిగడ్డిని జీడిమామిడి చెట్ల మొదళ్ళలో వేయటం వల్ల మొక్కలకు ఆచ్ఛాదన (మల్చింగ్) ఏర్పడి, వేసవి కాలంలో భూమిలోని తేమ ఆవిరి అవకుండా కాపాడుతుంది.
- క్రమంగా ఈ ఎండు గడ్డి, ఎండు ఆకులు మంచి సేంద్రియ ఎరువుగా మారి నేలకు అందుతాయి. నేల గుల్లబారుతుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు.
- మంచి పూత, కాత కాస్తుంది. కాబట్టి తోటలలో మల్చింగ్ చేయడం చాలా అవసరం.
అంతర పంటలు:
జీడిమామిడి నాటిన 2-3 సంవత్సరాలలో చెట్ల మధ్య గల స్థలంలో అంతర పంటలుగా వివిధ కూరగాయలు, పొగాకు, వరి, మిరప నార్లను లాభసాటిగా పెంచవచ్చు. పప్పు దినుసు పంటలను అంతర పంటలుగా పెంచటం వల్ల ఆర్థికంగా లాభం పొందటమే కాకుండా, భూసారం వృద్ధిచెంది, జీడిమామిడి మొక్కలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
తోటలలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం వలన నేల గుల్లబారి, గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలను అరికట్టవచ్చు. అదే విధంగా నేలలో వుండే పురుగులు నిద్రావస్థ దశలోనే చనిపోతాయి. కాపుకు వచ్చిన తోటలలో వర్షాలకు ఒకసారి దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి నేల కోతను కొంత వరకు అరికడుతుంది.
ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244)
సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్లైన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ‘కిసాన్ మిత్ర’ ప్రారంభించడం జరిగింది. కారణాలు ఏవైనా అధికారులకు మరియు రైతులకు మధ్య దూరం పెరగడం వలన చాలా సమస్యలు గురించిన సమాచారం రైతుల వరకు చేరట్లేదు. మరియు రైతుల సమస్యలు అధికారుల దృష్టికి రావట్లేదు. కనుక కిసాన్ మిత్ర రైతుల నుండి అందుకున్న సమస్యలని వెంటనే సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించే వరకు రైతుకు తోడుగా వుంటుంది. కిసాన్ మిత్ర ద్వారా వికారాబాద్తో పాటు ఆదిలాబాద్ (ఫిబ్రవరి 7, 2018) మరియు మంచిర్యాల జిల్లాల (మార్చి 29, 2018) రైతులకి సేవలు అందుతున్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ పంట కాలం నడుస్తున్నందున కిసాన్ మిత్రకు ఎక్కువగా రెవెన్యూ, రైతుబంధు పెట్టుబడి సహాయం, పంట బీమా, పంట రుణాలు, రుణమాఫీ, సేంద్రీయ వ్యవసాయం గురించిన సమాచారం గురించిన ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఒక దానితో ఒకటి ముడిపడినందున రైతుల తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. పట్టా పాసుబుక్కు రాకపోతే రైతుబంధు పెట్టుబడి సహాయం అందదు, అంతే కాక పంట ఋణం తీసుకునే సౌలభ్యం వుండదు అలాగే పంట బీమా చేసుకోలేరు. అన్నీ ఉండి పంటఋణం రెన్యువల్ చేయించుకోవాలంటే ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించింది కాబట్టి రెన్యువల్ చేసుకోవచ్చో లేదో అనే సందేహం. అదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డులు గత సంవత్సరం జారీ చేసారు, ఈ సంవత్సరం తిరిగి వాటిని రెన్యువల్ చేసుకోవాలి. కానీ సర్క్యులర్ రాలేదనే కారణంతో తహసిల్దార్లు ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ చెయ్యలేదు మరియు ఉన్న వాటిని రెన్యువల్ చెయ్యట్లేదు, పత్తికి పంట బీమా చెల్లించే గడువు జూలై 15వ తేదీన ముగుస్తున్నందున కౌలు రైతులు మరియు పట్టా పాసుబుక్కు రాని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కిసాన్ మిత్ర ఆయా జిల్లాల యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం వైపు కిసాన్ మిత్ర అడుగులు
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రారంభించడానికి ముఖ్య కారణం తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు అనేక మంది విశ్లేషించారు. అందులో ఒక ముఖ్యమైన కారణం పంట మీద చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడడం. రైతు తన పంట పెట్టుబడి కోసం అవసరమైన రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులకు అప్పు చేయాల్సి వస్తోంది ఆ తర్వాత కరువు, వర్షపాతం లోటు భారీ వర్షాలు లేదా చీడ పీడల వలన అనుకున్న దిగుబడి రాక ఆ తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక పోతున్నారు. వీటి నుండి బయట పడడానికి రైతులకి ఉన్న ఒక మార్గం, రసాయనిక వ్యవసాయాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం. సేంద్రియ వ్యవసాయ పద్దతిలో రైతు తనకు స్థానికంగా దొరికే వనరులను వుపయోగించడం వలన తన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు అలాగే కొనుగోలుదారులు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ సేంద్రీయ ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపించడం వలన మార్కెట్లో వీటికి మంచి ధర కూడా లభిస్తోంది.
ఈ ప్రక్రియలోనే కిసాన్ మిత్ర పనిచేస్తున్న జిల్లాలో ఒకటి అయిన మంచిర్యాల జిల్లా పాలనాధికారి శ్రీమతి భారతి హోళికేరి గారు సేంద్రీయ వ్యయసాయం మీద చాలా మక్కువ చూపిస్తూ జిల్లాలో జరిగే ప్రతి మీటింగ్లో రైతులకు సేంద్రీయ వ్యవసాయం వైపుగా ప్రోత్సాహించడం గమనించి కిసాన్ మిత్ర, సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ) కలిసి రైతులకు మరియు అధికారులకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ ఇస్తాం అని ఒక ప్రతిపాదన కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. అందుకు వెంటనే అంగీకరించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయధికారితో కలిసి శిక్షణా తరగతులకు తేదీలు నిర్ణయించి, జిల్లాలో 750 మంది రైతులతో 1500 ఎకరాలలో ఈ సంవత్సరం సేంద్రీయ వ్యవసాయం చేయించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మొదట జిల్లాలోని లక్సెట్టిపేట్, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మండలాల్లో మే 17,18,19వ తేదీలలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. దీని కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం నుండి రాజశేఖర్, కన్నెగంటి రవి మరియు యాదవరెడ్డి హాజరయ్యి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత మే 25వ తేదీన మంచిర్యాలలో డా|| జి.వి. రామాంజనేయులు వ్యవసాయ, ఉద్యాన మరియు గ్రామీణాభివృద్ది శాఖ సిబ్బందికి సేంద్రియ వ్యవసాయం గురించి, తిరిగి వారి మండలాల్లోని రైతులకు శిక్షణ ఇచ్చే లాగా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలన్నింటిలో ముఖ్యంగా రసాయన వ్యవసాయం వలన కలిగే దుష్పరిణామాలు మరియు సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే ఉపయోగాలతో పాటు, అందరినీ పి.జి.ఎస్. సర్టిఫికేషన్ క్రిందకు తీసుకు రావాలని,రైతులను సహకార సంఘాలుగా నిర్మాణం చేయాలని, రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని చర్చించడం జరిగింది. శిక్షణతో పాటుగా మనకు స్థానికంగా దొరికే వనరులతో సేంద్రీయ ఎరువులు, ద్రావణాలు మరియు కషాయాలు ఎలా చేసుకోవాలి అనే సమాచారాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం తనకున్న అనుభవంతో వ్రాసిన ”స్థానిక వనరులతో సుస్థిర సేద్యం” అనే ఒక పుస్తకాన్ని జిల్లా యంత్రాంగానికి మరియు రైతులకు అందించడం జరిగింది.
ఈ క్రమంలో కిసాన్ మిత్ర రైతులకు విత్తనం దగ్గర నుండి మార్కెట్ వరకు అవసరమయ్యే సూచనలు మరియు సలహాలు ఇవ్వడానికి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అందులో వారికి కావాల్సిన సమాచారం అందిస్తున్నాము. అలానే వివిధ పంటలకు సేంద్రీయ వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులను వివరంగా జిల్లా వ్యవసాయ శాఖకు సమాచారం పంపడం జరిగింది. దానితో పాటు రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి తమకు అవసరమైన ఎరువులు, కషాయాలు, ద్రావణాలు ఉమ్మడిగా తయారు చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతోంది.
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి
ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనాలను పచ్చళ్ళలో సువాసనకై వాడతాము. ఆకుకూరలలో చాలా పోషక విలువలు ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతికూర మరియు గింజలలో ”ఔషధ గుణాలు” చాలా ఎక్కువ. కొత్తిమీర ఆకులు మరియు కాండమును సలాడ్లలో కూడా విరివిగా వాడతారు. ఆకుకూరలలో విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాల రీత్యా సస్యరక్షణ కోసం రసాయన క్రిమినాశకాలను వాడకూడదు. సేంద్రియ పద్ధతులలోనే సస్యరక్షణ చేయాలి.
కీటకాలు:
రసంపీల్చే పురుగులు :
పేనుబంక, తామరపురుగు, దీపపు పురుగులు, పిండినల్లి, సిల్లిడ్నల్లి మొదలైనవి. రసంపీల్చే పురుగులు ఆకులనుండి మరియు లేత కాండం నుండి రసంను పీల్చుట వలన ఆకులు ముడుచుకు పోయి పసుపు రంగుకు మారతాయి. ఆకులు నాణ్యతను కోల్పోతాయి. ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి కూడా ఏర్పడుతుంది.
నివారణ:
తప్పనిసరి పరిస్థితులలో వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేపనూనె మొ||) మాత్రమే పంట కాలంలో 1-2 సార్లు 10 రోజుల వ్యవధిలో పంటపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసిన తరువాత 3-4 రోజుల వ్యవధిలో ఆకులను కోసుకోవచ్చు. కోసిన ఆకులను మంచి నీటిలో బాగా శుభ్రం చేసి వాడుకోవాలి.
ఆకులు తినే గొంగళి పురుగులు:
గొంగళి పురుగులు ఆకులను లేత కొమ్మలను తినడం వలన ఆకులకు రంధ్రాలు ఏర్పడి నష్టాన్ని కలుగజేస్తాయి. ఆకులు నాణ్యతను కోల్పోతాయి.
నివారణ:
గొంగళి పురుగులను చేతితో ఏరివేసి నాశనం చేయడం చాలా మంచిది. పైన సూచించిన వేప సంబంధిత సస్యరక్షణ మందులను మాత్రమే వాడాలి.
తెగుళ్ళు:
ఆకుకూర పంటలను ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, కుళ్ళు తెగులు ఆశించి పంటకు నష్టం కలిగిస్తాయి.
నివారణ:
- తెగులు సమస్య ఎక్కువగా ఉన్న భూములలో పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
- బీజామృతం, బీజరక్షతో విత్తనశుద్ధి తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి.
- 2 కిలోల ట్రైకోడర్మా విరిడీ, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు మరియు 10 కిలోల వేప పిండి కలిపి నీళ్లు జల్లి వారం రోజులు మగ్గిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వలన నేల ద్వారా ఆశించే తెగుళ్ళను అరికట్టవచ్చు.
- పుల్ల మజ్జిగ + ఇంగువ ద్రావణం (ఒక ఎకరానికి 6 లీటర్ల పుల్లటి మజ్జిగ + 100 గ్రాముల ఇంగువ + 100 లీటర్ల నీరు) 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారీ చేయడం వలన ఆకుమచ్చ తెగులు మరియు బూడిద తెగులు నివారించబడుతుంది.
- జీవామృతాన్ని 15 రోజుకు ఒకసారి పంటపై పిచికారీ చేయడం వలన నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చు. జీవామృతం పంటలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
సొర, బీర, కాకర, పొట్ల, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ మరియు చిక్కుడు
పురుగులు: గుమ్మడి పెంకు పురుగు నివారణ :
తల్లి పురుగులు లేత ఆకులను ఆశించి ఎక్కువ నష్టం పంటకు కలిగిస్తాయి. వీటి నివారణకు వేప కషాయం లేదా నీమాస్త్రం రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై):
తల్లి ఈగలు మొగ్గలపై మరియు లేత పిందెలపై గ్రుడ్లు పెడతాయి. వీటి నుండి వచ్చిన సన్నని పురుగులు కాయ లోపలి గుజ్జును తిని నష్ట పరుస్తాయి. అందువలన కాయలు కుళ్ళిపోతాయి. వీటి నివారణకు మొగ్గ సమయంలో రెండు సార్లు వేప కషాయం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. మొక్క మొదళ్ళలో వేప పిండి పాదుకు 5 కిలోల చొప్పున వేయాలి. తల్లి ఈగలను ఆకర్షించేందుకు మిథైల్ యూజినాల్ ఎరలను పొలంలో అమర్చాలి. ఇవి తల్లి ఈగలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
పాము పొడ పురుగు (పాము పొడ తెగులు) :
ఈ పురుగు గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరలలో చొచ్చుకొనిపోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తాయి. ఆకులపై అడ్డదిడ్డంగా తెల్లని చారలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ పురుగు వల్ల పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పంట పెరుగుదల దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా రెండు శాతం వేప నూనెను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. పురుగు నష్టం చేసిన ఆకులను ఎప్పటికప్పుడు పంటనుండి తొలగించి నాశనం చేయాలి.
తెగుళ్ళ నివారణ : బూజు తెగులు:
ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడి, ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పండి ఎండిపోతాయి. దీని నివారణకు పులిసిన మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
బూడిద తెగులు:
ఆకు పై భాగంలో తెల్లని పొడిలాగా ఏర్పడి, ఆకులు పసుపు రంగుకు మారతాయి. ఉధృతి ఎక్కువైతే బూడిద తెగులు కాండం పూతకు కూడా వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట పెరుగుదల దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా రెండు శాతం వేప నూనెను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. తెగులు నష్టం చేసిన ఆకులను ఎప్పటికప్పుడు పంటనుండి తొలగించి నాశనం చేయాలి.
ఆకుమచ్చ తెగులు:
ఆకులపైన చిన్నని గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఈ మచ్చలు పెద్దవిగా మారి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఒక్కోసారి ఈ మచ్చలు కాయలకు ఆశించి నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు (వైరస్ తెగులు):
ఆకులలో ఈనెల వద్ద పసుపురంగు చారలు ఏర్పడతాయి. దీనినే ”మొజాయిక్” తెగులు అని కూడా అంటారు. వైరస్ తెగుళ్ళ వ్యాప్తి రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
నివారణ:
- విత్తనాలను పచ్చి ఆవుపాలలో (ఒక లీటరు ఆవు పాలు + 250 గ్రాముల విత్తనాలు) 15 -20 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి.
- రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం లేదా 5 శాతం వావిలాకు కషాయం లేదా నీమాస్త్రం పంటపై రెండు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసి సమర్ధవంతంగా అరికట్టాలి.
- 5 శాతం ఆవుపాలు (5 లీటర్ల పచ్చి ఆవు పాలు + 100 లీటర్ల నీరు) పంటపై రెండు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
- వైరస్ తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి పీకి వేసి నాశనం చేయాలి.
- వైరస్ తెగులు సోకని మొక్కల నుండి రైతులు విత్తనాలను సేకరించుకోవాలి.
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…?
సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ కేవలం రాష్ట్ర, జిల్లా స్థాయి స్థూల అభివృద్ధి (జీడీపీ) పెరగడమే, రాష్ట్ర అభివృద్ధిగా పరిగణిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో సంపద పెరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగొచ్చు. కొంతమంది ఆదాయం వందలరెట్లు పెరగొచ్చు. ప్రస్తుతమున్న నిర్దిష్ట నిర్వచనం ప్రకారం తలసరి ఆదాయాలు కూడా పెరిగినట్లు కనిపించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితిలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ముఖ్యంగా మొత్తం సమాజంలో 70 శాతంగా ఉన్న గ్రామీణ ప్రజల, ఆదివాసీ ప్రజల, అసంఘటితరంగ శ్రామికుల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? అనేది మొత్తం ”అభివృద్ధి” చర్చకు ప్రాతిపదిక కావాలి. అలాగే సహజ వనరుల (భూమి, నీటి వనరులు, అడవులు, ఖనిజ సంపద) సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణ (విష పూరితం కాని గాలి, నీరు, సాగు భూమి), మానవ వనరుల వినియోగం
(ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం) కూడా ఈ చర్చకు ప్రధాన భూమిక కావాలి.
కుటుంబాల, లేదా వ్యక్తుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, ఆయా కుటుంబాల లేదా వ్యక్తుల ఆర్ధిక ఆదాయాల పెరుగుదల ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది. ఈ ఆదాయాల పెరుగుదల – సహజ వనరులపై, జీవనోపాధిలపై ఆయా సమాజ సమూహాలకు, వ్యక్తులకు ఏ మేరకు హక్కు ఉంది, వనరుల వినియోగానికి ఏ మేరకు అవకాశం ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది సహజ వనరులపై, అవకాశాల వినియోగంపై హక్కు కోసం ప్రజా సమూహాలు, వర్గాలు నిరంతర పోరాటాలు సాగిస్తుంటాయి. ఈ పోరాటాలు కొన్ని సందర్భాలలో సాయుధ పోరాటాల రూపం తీసుకున్నా, కొన్ని సార్లు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజా ఉద్యమాల రూపం తీసుకున్నా అంతిమ సారాంశంలో అవి వనరులపై హక్కు కోసం సాగిన పోరాటాలే. అలా తెలంగాణ రాష్ట్రం పరిధిలో 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం ‘దున్నేవానికి భూమి హక్కు కావాలి’ అనే నినాదంతో సాగింది. గత 50 సంవత్సరాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ”నీళ్లు, నిధులు, నియామకాలు ”నినాదంతోనే సాగింది. ఈ ఉద్యమాలు తెలంగాణ ప్రజలకు, మొత్తం భారత దేశానికి కూడా విలువైన విజయాలను, ఫలితాలను అందించాయి. దేశ వ్యాపితంగా పేద ప్రజలు సాగించిన ఇటువంటి ఉద్యమాల ఫలితంగానే అనేక చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు) వచ్చాయి. ఈ చట్టాలకు, జీవోలకు అనుగుణంగా అనేక మార్గదర్శకాలు కూడా అమలులోకి వచ్చాయి. కానీ, అసలు సమస్య-ప్రభుత్వాలు ఆయా చట్టాలను, జీవోలను వాటి స్పూర్తితో అమలు చేయకపోవడం.
తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు, జీవోలు ఇలాగే అమలుకు నోచుకోకుండా ఉండిపోతున్నాయి. అమలు అయిన చోట కూడా, అరకొరగా అమలవుతున్నాయి. ఈ చట్టాలను సంపూర్ణ స్పూర్తితో అమలు చేయకపోతే, సమాజంలో అట్టడుగున వున్న వర్గాలకు హక్కులు దక్కవు. ఆదాయాలు పెరగవు. రాష్ట్ర స్థూల ఆర్ధిక వృద్ధి జరిగినా, మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం పెరగవు. రాష్ట్రంలో 1956 తెలంగాణ కౌలు రైతుల చట్టం, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం, 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2011 అధీకృత సాగుదారుల (కౌలు రైతుల) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టం, 2016 వ్యవసాయదారుల రుణ విముక్తి చట్టాల అమలుతీరు దారుణంగా ఉంది. అలాగే భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందించేందుకు 2014 జులై 26న వచ్చిన జీవో. నంబర్ 1, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన జీవో 194 కూడా అమలు కావడం లేదు. లక్షలాది మంది అసంఘటిత కార్మికులకు ప్రయోజనకరమైన అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పని తీరు కూడా నాసి రకంగా ఉంది.
ఈ చట్టాలను, జీవోలను అమలు చేయడానికి పూనుకోని ప్రభుత్వం, తన కవసరం అయినప్పుడు మాత్రం కొత్త చట్టాలను, జీవోలను వేగంగా తెచ్చి అమలు చేయడానికి పూనుకుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల పేరిట భూములను సేకరించడానికి, 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ 2016లో తెచ్చిన ప్రత్యేక భూసేకరణ చట్టం, జీవో 123, మరియు 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయితీలకు ఇచ్చిన హక్కులకు తూట్లు పొడుస్తూ, ఎటువంటి చట్టబద్ధతా లేని రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ 2017 సెప్టెంబర్ 9న తెచ్చిన జీవో నంబర్ 39 ఈ కోవకు చెందుతాయి.
1973లో వచ్చిన భూ గరిష్ట పరిమిత చట్టం నిజంగా అమలు జరిగి ఉంటే ఈ రాష్ట్రంలో భూసంస్కరణలు దేశానికి ఆదర్శంగా ఉండేవి. కానీ ఈ చట్టానికి మొదటి దశలోనే వివిధ మినహాయింపులతో తూట్లు పొడిచారు. దానితో మిగులు భూమి ఎక్కువ తేలలేదు. తేలిన మిగులు భూమి కూడా కోర్ట్ వివాదాలలో చిక్కుకుంది. పేదలకు పంచిన కొద్ది పాటి భూమి కూడా, సాగు యోగ్యం కాకుండా వుండింది. 1980 దశకం తర్వాత భూ సంస్కరణలు బూతు మాటగా మారాయి. భూ పోరాటాలు కూడా తగ్గు ముఖం పట్టాయి. ఇవాళ వందలాది ఎకరాలు కలిగిన పెద్ద జమీందారులు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు. భూ గరిష్ట పరిమితి చట్టం అమలు గురించి అడిగే నాథుడే లేడు .మాగాణి భూమి 18 ఎకరాల కంటే ఎక్కువ, మెట్టభూమి 54 ఎకరాల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి (5 గురు సభ్యుల) ఉండకూడదని చట్టం చెబుతున్నా, అది అమలవుతుందా లేదా అని పట్టించుకునే వాళ్ళు లేరు. పేదలకు భూమి పంచండి అని రైతు సంఘాలు అడిగినా ”భూమి ఎక్కడ ఉంది” అనే ప్రశ్న ప్రభుత్వాల నుండి వినపడుతుంది. సమగ్ర భూసర్వే చేసి, భూ సంస్కరణల చట్టం (గరిష్ట పరిమితి) ప్రకారం మిగులు భూమి తేల్చితే, పేద గ్రామీణులకు పంచడానికి భూమి బయటకు వస్తుంది.
తెలంగాణ గ్రామీణ సమాజంలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభాకు సెంటు భూమి దక్కలేదని 2011 సామజిక, ఆర్ధిక కుల గణన (ఎస్.ఇ.సి.సి.) సర్వే తేల్చి చెప్పింది. గత 15 సంవత్సరాలలో అరకొరగా పేదలకు భూ పంపిణీ జరిగినప్పటికీ 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల దళిత కుటుంబాలకు భూమిలేదని, ఈ కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున 9 లక్షల ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 2014 ఆగష్టు 15 నుండీ, ఇప్పటి వరకూ కేవలం 5,185 మందికి 13,190. 23 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చింది. గత సంవత్సర కాలంగా పూర్తిగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ విషయాన్ని పూర్తిగా మాట్లాడటం మానేసింది. భూ పంపిణీ జరగని కారణంగానే రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్రంలో 13 శాతం మంది కౌలు రైతు ఉన్నారని నీతీ ఆయోగ్ ప్రకటించినా, 10 లక్షలకు మించి కౌలు రైతులు ఉంటారని అనేక ప్రభుత్వ నివేదికలు నిర్ధారించినా, కౌలు రైతులను గుర్తించే 2011 అధీకృత సాగుదారుల చట్టం అమలు కావడం లేదు. కౌలు రైతులకు, బ్యాంకు రుణాలు, రైతుబంధు లాంటి పథకాలు అమలు కావడం లేదు. సెంటు భూమి లేని కౌలు రైతులు రైతు బీమాకు కూడా అర్హత సాధించలేకపోతున్నారు. చట్టం వచ్చిన తోలి దశలో 44,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా ,తెరాస ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమలుచేయడం లేదు. కౌలు రైతులు తమ ప్రాధాన్యతే కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. కౌలు రైతులకు కూడా తాకట్టు లేని పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు ఎన్ని సర్క్యూలర్లు జరీచేసినా బ్యాంకులు అమలు చేయవు. దీనితో కౌలు రైతు కుటుంబాల ఆదాయాలు పెరగడం లేదు. కౌలు ధరలపై నియంత్రణ లేకపోవడం వల్ల, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
గ్రామీణ కుటుంబాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మరో చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో పని కోరుకున్న ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించాలి. కరువు కారణంగా వలసలను నివారించి, గ్రామంలోనే ఆదాయాలు కల్పిచే లక్ష్యం ఈ చట్టానికి ఉంది.
కానీ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండీ ఈ చట్టం అమలుతీరు ఘోరంగా ఉంది. 2019 మార్చ్ నాటికి ఈ రాష్ట్రంలో 53 లక్షల 95 వేల కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయగా, ఇందులో 32 లక్షల 18 వేల జాబ్ కార్డులు మాత్రమే ఆక్టివ్గా ఉన్నాయి. ఈ జాబ్ కార్డుల ఆధారంగా మొత్తం 1 కోటీ 16 లక్షల 46 వేల మంది పని కోసం నమోదు చేసుకోగా, 2019 మార్చ్ నాటికి ఆక్టివ్గా వున్న శ్రామికులు 58 లక్షల 98 వేల మంది మాత్రమే. జాబ్ కార్డులు పొందిన కుటుంబాలలో 2018-2019 సంవత్సరంలో కేవలం 24 లక్షల 22 వేల కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఈ కుటుంబాల నుండి పనిలో పాల్గ్గొన్న శ్రామికులు 40 లక్షల 68 వేల మంది మాత్రమే. చాలా సందర్భాలలో శ్రామికులు పని కోరుకున్నా, పనులు కల్పించడం లేదు. అనేక సార్లు ఈ పధకం క్రింద పనికి వెళితే నెలలు గడిచినా వేతనాలు రాకపోవడం వల్ల శ్రామికులు కూడా ఆసక్తి చూపించడం లేదు. విచిత్రమేమిటంటే మొత్తం జాబ్ కార్డులు పొందిన యాక్టీవ్ కుటుంబాలలో 100 రోజులు పూర్తిగా పని దొరికిన కుటుంబాలు కేవలం 1 లక్షా 53 వేల 823 మాత్రమే. 205 రూపాయలు ఉపాధిహామీ రోజు వేతనంగా నిర్ణయించినా, 2018-2019లో పడిన సగటు రోజు కూలీ 146.61 రూపాయలు మాత్రమే. చట్టం ప్రకారం నిజంగా జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికీ 100 రోజుల పని కల్పించగలిగితే, ఆయా కుటుంబాలకు కనీసం 15,000 రూపాయలు సంపాదించుకోగలిగేవి. కానీ ఒక కుటుంబానికి సగటున 43 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. వర్షాధార ప్రాంతాలలో ఈ చట్టం క్రింద దొరుకుతున్న పని, వస్తున్న ఆదాయం కూడా గ్రామీణ పేద కుటుంబాలకు అత్యంత ముఖ్యమైనవి.
ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా సరిగా లేకపోవడం వల్ల ఆదివాసీ కుటుంబాల వ్యవసాయానికి సరైన మద్ధతు అందడంలేదు. పోడు వ్యవసాయదారులుగానే వాళ్ళను చూడడం వల్ల, పంట రుణాలు, రైతుబంధు, రైతు బీమా అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2018 నవంబర్ 30 నాటి నివేదిక ప్రకారం 1,86,679 దరఖాస్తులు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు పెట్టారు. అందులో 1,83,252 దరఖాస్తులు వ్యక్తిగత భూ హక్కుల కోసం, మరియు 3,427 దరఖాస్తులు అడవిపై సముదాయక హక్కుల కోసం పెట్టినవి. ఇందులో కేవలం 94,360 దరఖాస్తులను మాత్రమే (93,639 వ్యక్తిగత మరియు 721 సాముదాయక) ఆమోదించారు. మరో 83,757 దరఖాస్తులను తిరస్కరించారు (44 శాతం). చట్టం ప్రకారం హక్కులు కల్పించిన అటవీ భూమి కేవలం 7,54,339 ఎకరాలు మాత్రమే. ఎందుకు తమ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయో ఆదివాసీ కుటుంబాలకు తెలవదు. ఈ హక్కులు కల్పించక పోవడం వల్ల ప్రభుత్వం నుండి ఈ కుటుంబాలకు వ్యవసాయ పరంగా అందాల్సిన ఏ సహాయమూ అందడంలేదు.
2016లో వ్యవసాయదారుల రుణవిముక్తి చట్టం చేసినా, ఆ చట్టం ప్రకారం పని చేయడానికి కమీషన్కు ఇంతవరకూ సరైన వసతి, ఫర్నిచర్ కూడా కల్పించలేదు. ఈ కమీషన్ గురించి వ్యవసాయ దారులలో ప్రచారం కూడా కల్పించలేదు. ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోతున్నారు. బ్యాంకు రుణాలు కూడా తీర్చలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతులకు అందాల్సిన మద్ధతు ధరలు అందకపోవడం వల్ల రైతుల ఆదాయాలు పెరగడంలేదు.
వ్యవసాయ కుటుంబాల సంక్షోభం కారణంగా ఈ రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటి వరకూ 3,850 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారం రిపోర్ట్ అయినవి కేవలం 2066 మాత్రమే. ఇందులో కూడా ప్రభుత్వం ”న్యాయమైన ఆత్మహత్యలుగా ”గుర్తించినవి 1,149 మాత్రమే. వీటిలో 846 కుటుంబాలకు 194 జీవో ప్రకారం 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి ఆమోదం తెలిపారు. కానీ, విషాదమేమిటంటే ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించిన 500 బాధిత కుటుంబాలాకు నిధులు విడుదల చేయలేదు. లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని చెప్పే ప్రభుత్వానికి ఈ 500 కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి 30 కోట్ల రూపాయలు లేవా…?
అమలు కాని జీవోలు, చట్టాల వల్ల గ్రామీణ వ్యవసాయ దారులు, ఎంతగా నష్టపోతున్నారో, ఎంతగా మానసిక క్షోభకు గురవుతున్నారో ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా అర్థమవుతుందా…?
వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. రైతులు ప్రతి పంటకాలంలో పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. పురుగుల గురించి, వాటి జీవిత చక్రాల గురించి రైతులకు తెలిసి ఉంటే, వారు పంటకు ముప్పు వాటిల్లక ముందే పురుగులను అరికట్టగల్గుతారు. ఈ రైతు పరిజ్ఞానానికి ఇప్పటికే రుజువైన కొన్ని సేంద్రియ పద్ధతులను జోడించినట్లయితే పురుగుల బెడదను బాగా తగ్గించవచ్చు.
చీడ పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పనులు
- లోతైన వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి.
- వరి నాట్లు వేసేటప్పుడు ప్రతి 3 మీటర్లకు ఒక అడుగు వెడల్పులో కాలి బాటలు తూర్పు, పడమర దిశగా ఏర్పరచాలి.
- వరి నాటిన 20 రోజుల తరువాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపు రంగు డబ్బాలు ఎకరానికి 15 నుండి 20 అమర్చుకోవాలి. పచ్చదోమ మరియు తామర పురుగులు డబ్బాలకు అతుక్కుంటాయి.
- డబ్బాలకు తప్పనిసరిగా జిగురు పూయాలి. జిగురు లేనట్లయితే పురుగులు వరిని నష్టపరుస్తాయి.
- వరి నాటిన వెంటనే ఎకరానికి 10 నుండి 15 పక్షి స్థావరాలను అమర్చాలి. వరి పొట్ట దశకు (60 రోజులు) రాగానే పక్షి స్థావరాలను తొలగించాలి.
సూక్ష్మపోషక లోపాల నివారణకు…
వరి నారుమడి మరియు ప్రధాన పొలంలో పోషకలోపాల నివారణకు (ఇనుము, జింకు, పొటాష్) పశువుల పేడ, మూత్రం మరియు ఇంగువ ద్రావణం తయారు చేసి పిచికారీ చేసుకోవాలి.
పురుగుల నివారణ:
రసం పీల్చు పురుగుల (పచ్చదోమ, తామర పురుగు, ఉల్లికోడు, వరినల్లి) నివారణ కొరకు నీమాస్త్రం లేదా ఎకరానికి 5% వేప కషాయం (5 కిలోల కాయ, పొడి, ఆకు 100 లీటర్ల నీటిలో) 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
కాండంతొలుచు పురుగు (తెల్లకంకి) నివారణకు ముందు జాగ్రత్త చర్యగా 5% వేప కషాయం లేదా అగ్నిఅస్త్రం 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు ఆశించిన తరువాత అగ్నిఅస్త్రం వుపయోగించాలి. కొడిస ఆకు ఎకరానికి 2 క్వింటాళ్ళు ముక్కలుగా చేసి ఆఖరి దుక్కిలో లేదా ప్రధాన పొలంలో వేసుకోవాలి.
ఆకుముడత పురుగు నివారణకు చిల్లకంపతో ముడిచిన ఆకులను విడదీసి 5% వేప కషాయం లేదా నీమాస్త్రం 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
సుడిదోమ నివారణకు వేపనూనె (ఎకరానికి 1-2 లీటర్లు) లేదా 5% వేప కషాయం లేదా నీమాస్త్రం 20 కిలోల ఇసుకలో కలిపి ప్రధాన పొలంలో ఉదయం (ఎండకాసే రోజులలో) చల్లుకోవాలి. ప్రధాన పొలంలో నీటిని పలుచగా (1/2 అంగుళం) ఉంచాలి.
కంపు నల్లి నివారణకు కంపునల్లినే ఉపయోగించాలి. ఉదయం పూట కంపునల్లులను సేకరించాలి. సుమారు 200-300 పురుగులను బాగా నూరి వడకట్టి 100 లీటర్ల నీటిలో (6 పంపులు) కలిపి పిచికారీ చేసుకోవాలి.
రెల్లరాల్చు పురుగుల నివారణకు పచ్చిమిర్చి-వెల్లుల్లి కషాయం లేదా ఎకరానికి 3 లీటర్లు బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించాలి.
నూలుకండె వరి ఈగ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంది. ఫలితంగా ఆకులు విరిగిపోతాయి. నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
వరిని ఆశించే పురుగులు – యాజమాన్యం
కాండం తొలుచు పురుగు
దీని తల్లి పురుగులు పసుపు వర్ణం గల రెక్కలను కలిగి, వాటిపైన మధ్యలో నల్లని మచ్చను కలిగి ఉంటాయి. అవి ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి వెంట్రుకలతో కప్పుతాయి. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్లపురుగులు వెలువడి, మూడు రోజులలో కాండంలోకి చేరి లోపలి కణజాలాన్ని తినేస్తాయి. ఈ పురుగులు వరి పంటను నారుమడి నుంచి వెన్ను అభివృద్ధి చెందే దశ వరకు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పిలకలు వేసే దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. దీనిని మొవ్వు కుళ్ళుగా పిలుస్తాం. ఈనిన తరువాత ఆశిస్తే వెన్నులోని గింజలన్నీ తాలుగింజలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి. దీనినే ‘ఊచపోటు’ అని అంటాం.
నివారణ :
- వేసవికాలంలో లోతుగా దుక్కి దున్నాలి. దీనివల్ల కొయ్య కాలలో ఉన్న నిద్రావస్థ లార్వాలను, కోశస్థదశ పురుగులను నివారించవచ్చు.
- దుక్కిలో పాలకొడిస వంటి ఆకులను తొక్కడం ద్వారా ఈ పురుగు రాకుండా నివారించుకోవచ్చు.
- ప్రధానపొలంలో నాటు వేసేటప్పుడు చిగుళ్ళు తుంచి నాటడం వలన పురుగు గుడ్లను నాశనం చేయవచ్చు.
- నేలకు దగ్గరగా కోత కోయడం వలన కోశస్థ దశలను నిర్మూలించవచ్చు.
- లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఒకటి చొప్పున పొలంలో పెట్టడం ద్వారా పురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు.
- పొలంలో రెక్కల పురుగులను కానీ, పురుగు గుడ్లను కానీ గమనించిన వెంటనే 5శాతం వేప కషాయాన్ని పిచికారి చేసి గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు.
- పురుగు మందు వాడని పొలాల్లో రైతుమిత్ర పురుగులు ఎక్కువగా ఉండడం వలన ఈ పురుగు గుడ్డు దశపై ఆశించే ట్రైకోగ్రామా పరాన్న జీవి ద్వారా సహజ సస్యరక్షణ జరుగుతుంది. ఈ పరాన్నజీవులను పురుగు ఉధృతిని బట్టి ఎకరానికి 20,000 చొప్పున రెండు మూడు సార్లు పొలంలో వదలడం ద్వారా జీవనియంత్రణ సాధించవచ్చు.
- తట్టుకొనే రకాలు నాటుకోవడం : వికాస్, సస్యశ్రీ, రాశి, కావేరి, వర్ష, పోతన, స్వర్ణముఖి లాంటి రకాలు కాండం తొలుచు పురుగును తట్టుకుంటాయి.
