1. వరి
- రబీ వరిలో తెగుళ్ళ నివారణ (సమగ్ర సస్యరక్షణ) అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకు ఎండు తెగులు, పొట్టకుళ్ళు తెగులు
- వీలైనంత వరకు తెగుళ్లను తట్టుకోగ వరి రకాలను ఎంపిక చేసుకోవాలి.
- తెగులు సోకని వరి పైరు నుండి విత్తనాలను ఎంచుకోవాలి.
- విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధిని పాటించాలి.
- గత పంట అవశేషాలను భూమిలో కలియదున్నాలి.
- వేసవి దుక్కులు చేయటం వలన గత పంటలోని తెగుళ్ల బీజాలు చాలా వరకు నిర్మూలించబడతాయి.
- ఎప్పటికప్పుడు పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం వలన తెగుళ్ళు వ్యాపించవు.
- పొలానికి మురుగు నీరు పోవు సదుపాయం కల్పించడం వలన, తెగుళ్ళ వ్యాప్తిని కొంత వరకు అరికట్టవచ్చు.
- వాతావరణ పరిస్థితులు, వరి రకాలు తెగుళ్ళ అభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరాన్ని బట్టి ఈ క్రింద సూచించిన ద్రావణాలను వరి పైరుపై పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంట బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
ఎ) పశువుల పేడ + మూత్రం + ఇంగువ ద్రావణం (లేదా)
బి) పుల్లని మజ్జిగ + ఇంగువ ద్రావణం (లేదా)
సి) శోంఠిపాల కషాయం (లేదా)
డి) మారేడు ఆకుల కషాయం
- సూచన: పైన సూచించిన ద్రావణాలను రైతు మార్చి మార్చి వాడటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
ప్రధాన పొలంలో దుక్కిలో జీవన ఎరువులైన సూడోమోనాస్, అజోస్పెర్లిం మొ॥ వాడటం వల్ల కూడా తెగుళ్ళను కొంత వరకు నివారించవచ్చు.
2. మొక్క జొన్న:
- రబీ మొక్క జొన్నలో కలుపు నివారించుట
- సేంద్రియ ఎరువు వేసి నీటిని కట్టుట.
- రసం పీల్చే పురుగు ఆశించిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టుట.
3. వేరుశనగ
- పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
- జొన్న, సజ్జ లాంటి పంటలను వేరుశనగ పంట చుట్టూ రక్షక పంటగా 2-3 సాళ్ళలో వేయటం వలన పురుగు వలసనను నివారించవచ్చు.
- ఎరపంటగా 100 ఆముదము మొక్కలను పొలంలో వేసి, లద్దె పురుగు పెట్టిన గ్రుడ్ల సముదాయాలను నాశనం చేయాలి. జల్లెడాకులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నాశనం చేయాలి.
- రెక్కల పురుగు ఉనికిని వాటి ఉధృతిని అంచనా వేసేందుకు ఎకరాకు 5 లింగాకర్షణ బుట్టలను అమర్చాలి.
- పిల్ల పురుగును నివారించుటకు 5 శాతం వేప ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
- పురుగును తినే పక్షులను ఆకర్షించటానికి ఎకరాకు 10 పక్షి స్థావరాలను అమర్చాలి.
- ఎస్.ఎన్.పి.వి. అనే వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 ఎల్.ఇ.ని 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. ఈ రోగం వచ్చిన పురుగు కొమ్మకు వేలాడి చనిపోతాయి.
- గోనె సంచి ముక్కను బెల్లం ద్రావణంలో తడిపి పొలంలో అక్కడక్కడ సాయంత్రం వేళలో అమర్చడం వలన లద్దెపురుగు రాత్రివేళ, గోనెసంచి ముక్క అడుగు భాగానికి చేరతాయి. ఈ విధంగా చేరిన లద్దె పురుగును సేకరించి నాశనం చేయటం వలన లద్దె పురుగు ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టవచ్చు. (రైతుల అనుభవం)
- లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి + వెల్లుల్లి ద్రావణాన్ని గాని పంచపత్ర కషాయం గాని ఒకసారి పంటపై పిచికారీ చేయాలి.
4. కంది, పెసర, మినుము
- పంట కోతలు
- కోతనంతరం జాగ్రత్తలు
- విత్తనాన్ని జాగ్రత్త చేయటం
- నిల్వలో మెళకులు
- మార్కెట్కు పంపుట
5. మిరప
- పండు కాయలను నిల్వ చేసుకోవటం
- మార్కెట్కు పంపుట
6. కాయగూరలు
- ఆకుకూరల విత్తనాలను ఎంపిక చేసుకోవటం
- విత్తన శుద్ధి ‘బీజరక్ష’తో చేసుకోవటం
- విత్తనాలను విత్తుకోవటం
- అలం పంట తవ్వకాల నిల్వ, మార్కెటింగ్ చేయుట.
- ఉల్లిగడ్డ తవ్వకాల, నిల్వ మార్కెటింగ్ చేయుట.
- ఫిబ్రవరి నెలలో వేసిన తీగజాతి కూరగాయల పంటకు (పాదుకు) సేంద్రియ ఎరువు వేయటం. పాదుకు సుమారు 2-3 కిలోల సేంద్రియ ఎరువు వేయాలి.
- రసం పీల్చే పురుగు గమనించిన యడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
7. పండ్లు
- అరటికి అంతరకృషి, సేంద్రియ ఎరువు వేయటం
- నిమ్మ, బత్తాయి, దానిమ్మలో ఎండు కొమ్ము కత్తిరించి ‘బోర్డాక్స్’ మిశ్రమము మొక్కలకు పూయాలి.
8. మామిడిపై సస్యరక్షణ (కాయపుచ్చు) నివారణ:
- ఈ పురుగు మామిడి కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పటి నుంచీ కోత దశ వరకూ ఆశిస్తుంది. పురుగు ఆశించిన కాయకు క్రింది భాగాన సొనతో కూడిన నల్లని మచ్చ ఏర్పడుతుంది. క్రమేపీ ఆ మచ్చ దగ్గర కాయ కుళ్ళుతుంది. కాయల చెట్టు నుండి రాలిపోవటం వాల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. గొంగళి పురుగు కాయ నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్న ఎండు పుల్లల్లో దూరి నిద్రావస్థ (కోశస్థ దశ)ను గడుపుతాయి.
- ఈ పురుగు నివారణకు, చెట్ల మీదనున్న ఎండు పుల్లను, రాలిన ఎండు పుల్లను, రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి తగబెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల సుమారు 80 శాతం పురుగులను నివారించి తరువాత పంటకు కలిగే నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు.
- 5 శాతం వేప ద్రావణాన్ని మామిడి కాయల గోళాకాయ సైజుతో ఉన్నప్పటి నుంచి క్రమంగా 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో పంటపై (కాయలపై) పిచికారీ చేయుట ద్వారా పురుగు ఉధృతిని చాల వరకు నివారించవచ్చు.
- మామిడి తోటను శుభ్రంగా ఉంచటం కూడా ఈ పురుగు నియంత్రణకు తోడ్పడుతుంది.
వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ సేపు ఉన్నట్లయితే విపరీతంగా వస్తుంది.
మిరపలో వచ్చే ఎండుతెగులు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, భూమిలో తేమవుండి పొలాల్లో మురుగునీరు పారుదల సరిగాలేని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది.
వరిలో వచ్చే అగ్గితెగులు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ.సెం.గ్రే. కంటే తక్కువ, గాలిలో తేమ 90శాతం కంటే ఎక్కువ, రాత్రిపూట మంచుబిందువులూ వర్షపు జల్లులు ఆకులమీద పడటం…. ఈ మూడు పరిస్థితులు ఒక వారంరోజులపాటు ఉంటే విపరీతంగా ఆశించి నష్టం కలుగజేస్తుంది.
వరిలో వచ్చే పొడతెగులు 28 డిగ్రీ.సెం.గ్రే. పైగా ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, మబ్బులు ఉన్న పరిస్థితులలో ఎక్కువగా విస్తరిస్తుంది. ఈ రోగం చెట్ల నీడల్లో తొందరగా అభివృద్ధి చెందుతుంది.
పొట్టకుళ్ళు తెగులు రాత్రి ఉష్ణోగ్రత 25డిగ్రి.సెం.గ్రే. ఉన్నప్పుడు, గాలిలో అధికంగా తేమ, మంచు, చల్లని వాతావరణం వున్నప్పుడు త్వరగా వ్యాపిస్తుంది.
బ్యాక్టీరియా ఎండుతెగులు 30 డిగ్రి.సెం.గ్రే. లోపు ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, జల్లులు లేదా వర్షం లేదా గాలివాన…. ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పడే వర్షాలలో వ్యాప్తి చెందుతుంది.
దీనివలన మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ప్రతి తెగులు వ్యాప్తికి కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఈ పరిస్థితులు లేకుంటే వ్యాధికారకాలు ఉన్నా, తెగులు వ్యాప్తి చెందదు. కానీ మనం పంటపై ఏదో మచ్చకనిపించగానే అవసరం లేకున్నా తెగుళ్ళ మందులు విపరీతంగా పిచికారి చేస్తున్నాం.
ఉష్ణోగ్రత ప్రభావం:
ఏ కాలంలో, ఏ ప్రాంతంలో తెగులు వ్యాపిస్తుందనేది ఆ ప్రాంత ఉష్ణోగ్రతలమీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల తెగుళ్ళు చలికాలంలో వస్తే, కొన్ని వేసవి కాలంలో వస్తుంటాయి. ఎక్కువగా తెగుళ్ళు వర్షాకాలంలో వస్తుంటాయి. చల్లని ఉష్ణోగ్రతలో వచ్చే తెగుళ్ళు ఎక్కువగా చల్లని ప్రాంతంలో పండించే పంటలలోనే వస్తాయి. అదేవిధంగా నారుకుళ్ళు, ఎండుతెగులు, బ్యాక్టీరియా ఎండుతెగులు, కుళ్ళుతెగులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటాయి.
1. ఒక పంటకు ఎండుతెగులు ఆశిస్తే 27 డిగ్రీ సెం.గ్రె. ఉష్ణోగ్రత దగ్గర ఆ పంటలో 12 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అదే 16 డిగ్రీ. సెం.గ్రె. దగ్గర 58 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
2. భూమిలో 12-20 డిగ్రీ.సెం.గ్రె. ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు శిలీంద్రం మొక్కలలోనికి సులువుగా ప్రవేశిస్తుంది.
తెగుళ్ళమీద తేమ, మంచు ప్రభావం :
సాధారణంగా ఆకుల మీద తేమలేకుంటే ఆ మొక్కల మీద వ్యాధికారమున్నా తెగులు వ్యాప్తిచెందదు. ఎందుకంటే శిలీంధ్రాలు మొక్కలలో ఆకులమీది తేమను ఉపయోగించుకొని మొలకెత్తి ఆకులలోని రంధ్రాల ద్వారా మొక్కలలోని ప్రవేశిస్తాయి. చాలా రకాల తెగుళ్ళ పెరుగుదలకు మంచు తోడ్పడుతుంది. అలాగే నీడ కూడా తెగుళ్ళ వ్యాప్తికి తోడ్పడుతుంది.
భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి.
- పంట ఎన్నిక
- పచ్చిరొట్ట ఎరువులు
- పచ్చిఆకు ఎరువులు
- సేంద్రియ ఎరువులు
- వానపాముల ఎరువు
- జీవన ఎరువులు
- మల్చింగ్ పద్ధతి
పంటల ఎన్నిక:
పంటల ఎన్నిక కేవలం మార్కెట్లో ఉన్న మంచి ధరను ఆధారం చేసుకొని మంచి దిగుబడుల కోసం అధిక పెట్టుబడులు వాడే దిశలో కాకుండా మన భూసారం, తేమ మరియు వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి.
తేమ, నీటి తడులను బట్టి : నేలలో తేమను బట్టి, నీటి తడులకు మనవద్ద ఉన్న నీటిని బట్టి ఎన్ని నెలలు పంటకు అందివ్వగలమో తెలుసుకొని పంటను ఎన్నుకోవాలి. అలాంటి పంటలకు ఉండే ”తేమ కొరకు కీలక దశల”పై అవగాహన ఉండాలి.
నేల లోతును బట్టి : కొన్ని పంటలవేర్లు చాలా లోతుకు వెళ్ళి తేమను పీల్చుకుంటాయి. నేలలోపలి పొర గట్టిపొర అయితే వేర్లను పెరగనివ్వవు. అటువంటి పరిస్థితుల్లో పైపైన వేర్లు ఉండే పంటలు వేసుకోవాలి.
పురుగులు తెగుళ్ళ సమస్యలు : పురుగులు తెగుళ్ళ సమస్యలు అధికమవటానికి పంటల విధానం ప్రధాన కారణం కూడా. ఈ సమస్యల ఉధృతి పెరగకుండా నియంత్రించే మొక్కలు ఎన్నుకోవాలి.
పంట మార్పిడి :
- ఎక్కువ పోషకాలను పీల్చుకునే మొక్కలతో తక్కువ పోషకాలను పీల్చుకునే వాటితో మార్పిడి చేసుకోవాలి.
- పప్పుజాతి మొక్కలను ఇతర పంటలతో మార్పిడి చేసుకోవాలి.
- లోతైన వేరు వ్యవస్థగల మొక్కలను పైపైన ఉండే వేరు వ్యవస్థగల మొక్కలతో మార్పిడి చేసుకోవాలి.
- పురుగుల, తెగుళ్ళ సమస్యలలో చిక్కుకునే పంటలను వాటిని తట్టుకునే పంటలతో మార్పిడి చేసుకోవాలి.
