భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి.

  1. పంట ఎన్నిక
  2. పచ్చిరొట్ట ఎరువులు
  3. పచ్చిఆకు ఎరువులు
  4. సేంద్రియ ఎరువులు
  5. వానపాముల ఎరువు
  6. జీవన ఎరువులు
  7. మల్చింగ్‌ పద్ధతి

పంటల ఎన్నిక:

పంటల ఎన్నిక కేవలం మార్కెట్‌లో ఉన్న మంచి ధరను ఆధారం చేసుకొని మంచి దిగుబడుల కోసం అధిక పెట్టుబడులు వాడే దిశలో కాకుండా మన భూసారం, తేమ మరియు వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి.

తేమ, నీటి తడులను బట్టి : నేలలో తేమను బట్టి, నీటి తడులకు మనవద్ద ఉన్న నీటిని బట్టి ఎన్ని నెలలు పంటకు అందివ్వగలమో తెలుసుకొని పంటను ఎన్నుకోవాలి. అలాంటి పంటలకు ఉండే ”తేమ కొరకు కీలక దశల”పై అవగాహన ఉండాలి.

నేల లోతును బట్టి : కొన్ని పంటలవేర్లు చాలా లోతుకు వెళ్ళి తేమను పీల్చుకుంటాయి. నేలలోపలి పొర గట్టిపొర అయితే వేర్లను పెరగనివ్వవు. అటువంటి పరిస్థితుల్లో పైపైన వేర్లు ఉండే పంటలు వేసుకోవాలి.

పురుగులు తెగుళ్ళ సమస్యలు : పురుగులు తెగుళ్ళ సమస్యలు అధికమవటానికి పంటల విధానం ప్రధాన కారణం కూడా. ఈ సమస్యల ఉధృతి పెరగకుండా నియంత్రించే మొక్కలు ఎన్నుకోవాలి.

పంట మార్పిడి :

  1. ఎక్కువ పోషకాలను పీల్చుకునే మొక్కలతో తక్కువ పోషకాలను పీల్చుకునే వాటితో మార్పిడి చేసుకోవాలి.
  2. పప్పుజాతి మొక్కలను ఇతర పంటలతో మార్పిడి చేసుకోవాలి.
  3. లోతైన వేరు వ్యవస్థగల మొక్కలను పైపైన ఉండే వేరు వ్యవస్థగల మొక్కలతో మార్పిడి చేసుకోవాలి.
  4. పురుగుల, తెగుళ్ళ సమస్యలలో చిక్కుకునే పంటలను వాటిని తట్టుకునే పంటలతో మార్పిడి చేసుకోవాలి.